వన్డే వరల్డ్కప్ ట్రోఫీతో పెరిగిన ఆత్మవిశ్వాసం
టి20 వరల్డ్కప్లోనూ సత్తా చాటుతాం
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. గతేడాది స్వదేశంలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తొలిసారి వరల్డ్కప్ చేజిక్కించుకుంది. ఆ విజయంతో జట్టులో కొత్త శక్తి వచ్చినట్లయిందని.. దీంతో ప్రపంచంలో ఎక్కడైనా మరిన్ని టైటిల్స్ గెలవగలమనే నమ్మకం కలిగిందని హర్మన్ చెప్పింది.
ఈ ఏడాది జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్ వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం హర్మన్ మాట్లాడుతూ... ‘ఏ రంగంలోనైనా విజయానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. క్రీడల్లో కూడా అంతే. మీరు ఏదో ఒక టైటిల్ సాధిస్తేనే తగినంత గుర్తింపు లభిస్తుంది. లేకపోతే పడ్డ కష్టానికి విలువ ఉండదు. మా జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడం వెనక సీనియర్ల కృషి ఎంతో ఉంది. వారు ఎప్పటి నుంచో కష్టపడి జట్టును ఈ స్థాయికి చేర్చారు.
ఇన్ని కష్టాల తర్వాత కూడా తగిన గుర్తింపు దక్కకపోతే దానికి అర్థమేలేదు. కాబట్టి ఒక టైటిల్ చాలా అవసరమైంది. అది సాధించిన తర్వాత కుటుంబసభ్యులు, అభిమానులు, మీడియా ఇలా అందరి నుంచి మాకు అనూహ్య స్పందన లభించింది. దీని కోసమే మేము ఎంతో కాలంగా ఎదురుచూశాం. వన్డే వరల్డ్కప్తో మాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం.
వన్డే వరల్డ్కప్ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం ఉంది. ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా... ఆ టూర్ మా ప్లేయర్లకు ఎంతో నేరి్పంది. ఇలాంటి మల్టీ ఫార్మాట్ సిరీస్లు మరిన్ని జరగాలి. వాటిలో సవాళ్లు ఎక్కువ ఎదురవుతాయి. అప్పుడే ప్లేయర్లు మరింత రాటుదేలుతారు’ అని వివరించింది.


