
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలకు భారత జట్టు ప్రకటన
టీమిండియాలో నలుగురు తెలంగాణ ప్లేయర్లు, ముగ్గురు ఆంధ్ర క్రీడాకారులు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా అండర్–19 జూనియర్ టీమ్, వ్యక్తిగత బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ భారీ బృందంతో బరిలోకి దిగనుంది. ఐదు విభాగాల్లో కలిపి భారత్ నుంచి మొత్తం 19 మంది క్రీడాకారులు ఈ టోర్నీ లో పోటీపడనున్నారు. ఇండోనేసియాలోని సోలో నగరంలో జూలై 18 నుంచి 27వ తేదీ వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత జట్టులో తెలంగాణ నుంచి నలుగురు... ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.
తెలంగాణకు చెందిన ప్రణవ్ రామ్ నాగలింగం పురుషుల సింగిల్స్లో, తన్వీ రెడ్డి అంద్లూరి మహిళల సింగిల్స్లో ఆడతారు. తెలంగాణకే చెందిన వెన్నెల కలగోట్ల సింగిల్స్తోపాటు డబుల్స్లో, మిక్స్డ్ డబుల్స్లో మంచాల కీర్తి పోటీపడుతారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అరిగెల భార్గవ్ రామ్, గొబ్బూరు విశ్వతేజ్ పురుషుల డబుల్స్లో... కోడె విష్ణు కేదార్ మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగుతారు.
భారత జట్టు: అన్ష్ నేగి, లాల్థజువాలా, రౌనక్ చౌహాన్, ప్రణవ్ రామ్ నాగలింగం (పురుషుల సింగిల్స్). రుజులా రాము, తన్వీ శర్మ, తన్వీ రెడ్డి అంద్లూరి, వెన్నెల కలగోట్ల (మహిళల సింగిల్స్). అరిగెల భార్గవ్ రామ్, గొబ్బూరు విశ్వతేజ్, భవ్య ఛాబ్రా, పరమ్ (పురుషుల డబుల్స్). వెన్నెల, రేషిక, గాయత్రి, మాన్సా రావత్ (మహిళల డబుల్స్). కోడె విష్ణు కేదార్, మంచాల కీర్తి, లాల్రామ్సాంగా, తారిణి సూరి (మిక్స్డ్ డబుల్స్).