Rohit Sharma: పిచ్‌ ఎలా ఉంటే ఏంటి? మా ఓటమికి ప్రధాన కారణం అదే! ఇకపై..

Ind Vs Aus 3rd Test: Rohit Sharma We Did Not Bat Well If We Brave Enough - Sakshi

Rohit Sharma Comments Over Indore Test Loss: ‘‘టెస్టు మ్యాచ్‌ ఓడటానికి అనేక కారణాలు ఉంటాయి. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్‌ అస్సలు బాగోలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ఎంత ముఖ్యమో మాకు ఇప్పుడు మరింత బాగా అర్థమైంది. 

వాళ్లకు 80-90 పరుగుల ఆధిక్యం లభించినపుడైనా మేము మెరుగ్గా బ్యాటింగ్‌ బ్యాటింగ్‌ చేయాల్సింది. కానీ మరోసారి మేము విఫలమయ్యాం. కేవలం 75 పరుగులు మాత్రమే చేయగలిగాం. ఒకవేళ మేము తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడి ఉంటే పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. ప్రస్తుతం మేము డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ఆలోచించడం లేదు.

మా దృష్టి మొత్తం ప్రస్తుతం నాలుగో టెస్టు మీదే ఉంది. అహ్మదాబాద్‌లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం గురించే మా ఆలోచన. తొలి రెండు టెస్టుల్లో మా ఆట తీరు బాగుంది. అహ్మదాబాద్‌లోనూ అదే పునరావృతం చేయాలని భావిస్తున్నాం. 

పిచ్‌ ఎలా ఉందన్న విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం సరిగ్గా చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత మన ప్రణాళికలు సరిగ్గా అమలయ్యాయా? లేదా అన్న అంశం గురించి మాత్రమే ఆలోచించాలి. బ్యాటర్లకు సవాల్‌ విసిరే పిచ్‌లపై ఆడినపుడు మరింత ధైర్యంగా బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది.

నిజానికి వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా నాథన్‌ లియోన్‌ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో మా బ్యాటింగ్‌ ఎలా ఉందో అందరూ చూశారు కదా! అయితే, ఈసారి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయలేకపోయాం’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇండోర్‌ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్‌ సేన.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరేందుకు ఆసీస్‌ అవకాశాలను మెరుగుపరిచింది. 

బ్యాటర్ల వైఫల్యం
ఇక బుధవారం(మార్చి 1) మొదలైన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109, రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు ఆలౌట్‌ కావడమే ఇందుకు నిదర్శనం. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా మొత్తంగా 60 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖావాజా తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులతో రాణించి జట్టుకు ఆధిక్యం అందించగా.. రెండో ఇన్నింగ్స్‌లో ట్రవిస్‌ హెడ్‌ 49, మార్నస్‌ లబుషేన్‌ 28 పరుగులతో అజేయంగా నిలిచి విజయలాంఛనం పూర్తి చేశారు. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నాథన్‌ లియోన్‌ మొత్తంగా 11 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 24 పరుగులు చేశాడు.

చదవండి: సికందర్‌ రజా సునామీ ఇన్నింగ్స్‌.. వరుసగా నాలుగో విజయం 
Danielle Wyatt: అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్‌.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్‌మెంట్!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top