అంతర్జాతీయ క్రికెట్లో పలు మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఇకపై వెలుతురు లేమి కారణంగా టెస్ట్ మ్యాచ్లు నిలిచిపోకుండా ఉండేందుకు రెడ్ బాల్ స్ధానంలో పింక్ బాల్ను వినియోగించుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే రెండు జట్ల కెప్టెన్లు ఇందుకు అంగీకరించాలి.
అప్పుడే వెలుతురు తగ్గినప్పుడు పింక్ బాల్ను ఉపయోగించవచ్చు. ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్ బాల్ క్లియర్గా కన్పిస్తోంది. దీంతో టెస్ట్ మ్యాచ్లలో బ్యాడ్లైట్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికనట్లే. ప్రస్తుతం పింక్బాల్ను కేవలం డే అండ్ నైట్ టెస్టుల్లో మాత్రమే వాడుతున్నారు.
అహ్మదాబాద్లో రెండు రోజుల పాటు జైషా అధ్యక్షతన జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే వెలుతురును మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఐసీసీ, ఎంసీసీ (మెరిల్బోన్ క్రికెట్ క్లబ్) సంయుక్తంగా సరికొత్త లైటింగ్ టెక్నాలజీపై పరిశోధనలు చేయనున్నాయి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఎంసీసీ (MCC)తో కలిసి ఐసీసీ నిధులు సమకూర్చనుంది.
బౌలింగ్ యాక్షన్ను పసిగట్టేందుకు 'హాక్-ఐ' (Hawk-Eye)
👉ఇకపై బౌలర్ల అనుమానాస్పద బౌలింగ్ శైలిని (చకింగ్) అంచనా వేసేందుకు మ్యాచ్ అధికారులు ఇకపై'హాక్-ఐ' ట్రాకింగ్ డేటాను ఉపయోగించుకోవచ్చు.
👉కోచ్లతో కమ్యూనికేషన్: ఫ్రాంచైజీ లీగ్ల తరహాలోనే.. ఇకపై అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా అఫీషియల్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచింగ్ సిబ్బంది మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడవచ్చు, వ్యూహాలను పంచుకోవచ్చు.
👉అంతర్జాతీయ టీ20ల్లో తప్పనిసరిగా 15 నిమిషాల బ్రేక్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే డ్రింక్స్ బ్రేక్ లేదా ఇంటర్వెల్ బ్రేక్ ముగిసిన వెంటనే బ్యాటర్లు ఆలస్యం చేయకుండా క్రీజులోకి రావాల్సి ఉంటుంది.
👉ఇప్పటి వరకు ట్రయల్ రూపంలో ఉన్న 'లెగ్సైడ్ వైడ్స్' నిబంధనను ఐసీసీ శాశ్వతంగా అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.
👉క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్లో పాల్గొనే జట్లు.. ఆ టోర్నమెంట్ సైకిల్ జరుగుతున్న సమయంలోనే ఇతర లిస్ట్-ఎ మ్యాచ్లు కూడా ఆడుకోవడానికి అనుమతించారు. అసోసియేట్ దేశాలకు మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలనే డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నారు.
👉ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2026 నుండి అధికారికంగా అమలుల్లోకి రానున్నాయి.
చదవండి: క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.. బీసీసీఐ సంచలన నిర్ణయం!


