హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాకిస్తాన్పై భారత్ డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంగ్ కాక్ వేదికగా ఇవాళ (నవంబర్ 7) జరిగిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తిక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సైతం బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో స్టువర్ట్ బిన్ని 4, మిథున్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఓ వికెట్ తీశారు.
అనంతరం పాక్ 87 పరుగుల లక్ష్య ఛేదనకు దిగగా వరుణుడు అడ్డు పడ్డాడు. వారి స్కోర్ 41/1 (3 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ను విజేతగా ప్రకటించారు.
మ్యాచ్ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. మాజ్ సదాఖత్ (7) ఔటయ్యాడు. సదాఖత్ వికెట్ స్టువర్ట్ బిన్నికి దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో కువైట్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8న జరుగుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది.
కాగా, క్రికెట్లో పాకిస్తాన్పై భారత్ గెలవడం ఇటీవలికాలంలో ఇది ఐదోసారి. పహల్గాం ఉదంతం తర్వాత భారత సీనియర్ పురుషుల జట్టు పాక్ను ఆసియా కప్-2025లో మూడు సార్లు ఓడించింది. అనంతరం భారత సీనియర్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్లో పాక్ను చిత్తు చేసింది. తాజాగా సూపర్ సిక్సస్ టోర్నీలోనూ పాక్కు భారత్ చేతిలో భంగపాటు ఎదురైంది.


