భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన "పద్మశ్రీ" అవార్డును ఇవాళ (మే 25) అందుకున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
భారత క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన హర్మన్, గత 17 ఏళ్లుగా జాతీయ జట్టుకు సేవలందిస్తూ అనేక చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్గా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్కు కొత్త గుర్తింపు వచ్చింది.
కాగా, ఈ ఏడాది ప్రారంభంలో హర్మన్తో పాటు భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. ప్రపంచకప్ విజయాలు సాధించిన ఇద్దరు కెప్టెన్లు ఒకే ఏడాది ఈ గౌరవాన్ని పొందడం భారత క్రికెట్కు అరుదైన ఘట్టంగా భావించబడుతోంది. క్రికెట్కు సంబంధించి గతంలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.


