ఐపీఎల్ 2026 నేపథ్యంలో ముంబై ఇండియన్స్కు సంబంధించి బిగ్ న్యూస్ అందుతుంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో కలిసి తదుపరి మ్యాచ్కు (ఆర్సీబీ) వేదిక అయిన రాయ్పూర్కు వెళ్లలేదు. ఈ విషయం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ ఉద్దేశపూర్వకంగా జట్టుకు దూరంగా ఉన్నాడా.. లేక యాజమాన్యమే అతన్ని దూరం పెట్టిందా అని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.
కాగా, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక జట్టు ప్రదర్శన దారుణంగా మారిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ముంబై ప్రదర్శన మరీ ఘోరంగా ఉంది.
కెప్టెన్గా, ఆటగాడిగా హార్దిక్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఏకంగా 7 పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా అసాధ్యం చేశాడు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
వ్యక్తిగతంగానూ హార్దిక్ దారుణ ప్రదర్శనలు చేశాడు. 8 మ్యాచ్ల్లో కేవలం 146 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. వరుస పరాజయాల తర్వాత హార్దిక్ గత మ్యాచ్లో (లక్నో) ఆడలేదు.
ఆ మ్యాచ్లో సూర్యకుమార్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి జట్టును గెలిపించాడు. టాస్ సమయంలో స్కై హార్దిక్ గురించి మాట్లాడుతూ.. అనారోగ్యం అని సర్ది చెప్పాడు. అయితే అప్పుడు హార్దిక్ గైర్హాజరీకి కారణం వేరని తెలుస్తుంది.
మేనేజ్మెంట్ ఘాటుగా మందలించడంతో హర్ట్ అయ్యి జట్టుకు దూరంగా ఉంటున్నాడని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా హార్దిక్ జట్టుతో కలిసి ప్రయాణించకపోవడం పై ప్రచారానికి మరింత బలాన్నిస్తుంది. హార్దిక్ త్వరలో జట్టుతో కలుస్తాడని సహచరులు చెబుతున్నా, అనుమానంగానే ఉంది.
ఎందుకంటే ఈ సీజన్లో ముంబై పని దాదాపుగా అయిపోయినట్లే. అధికారకంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. దీంతో హార్దిక్ ముందే జట్టు నుంచి తప్పుకుని ఉండవచ్చు. కాగా, మే 10న రాయ్పూర్ వేదికగా జరుగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.


