ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉన్న రైవలరీ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా మైదానం హాస్ ఫుల్ అవ్వాల్సిందే. అయితే ఈ వైర్యం ఇప్పుడు మైదానం దాటి భారత క్రికెట్ బోర్డు వరకు వెళ్లింది.
ఐపీఎల్-2026లో భాగంగా ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 43 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. స్టేడియంలో తమ ఆటగాళ్లను, తమిళ సంస్కృతిని కించపరిచేలా ప్రవర్తించారంటూ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.
ఏమి జరిగిందంటే?
సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ ట్రాక్ను డీజే ప్లే చేశారు. అయితే ఇవి దక్షిణాదికి చెందిన ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఈ ట్రాక్పై సీఎస్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ" అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారని సీఎస్కే తమ ఫిర్యాదులో పేర్కొంది.
సాధారణంగా డీజేలు హోమ్ టీమ్కు మద్దతుగా ఉంటారు. ఆ విషయాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మా ఆటగాళ్లు అవుట్ అయినప్పుడు డీజే కించపరిచాడు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ విషయం పై మేము బీసీసీఐకి లేఖ రాశాము" అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపాడు.
కాగా ఈ "దోశ, ఇడ్లీ" పాట వివాదం గత ఏడాది నుంచే నడుస్తోంది. గత సీజన్లో ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ ఈ పాట పాడటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అప్పట్లో చెపాక్ స్టేడియంలో జితేష్ అవుట్ అయినప్పుడు అదే పాటను ప్లే చేసి సీఎస్కే డీజే బదులిచ్చారు. కానీ సీఎస్కే మేనెజ్మెంట్ జోక్యం చేసుకుని ప్రత్యర్థి ఆటగాళ్లను టార్గెట్గా చేసుకుని కించపరచొద్దని ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఈ పాట వివాదం వెలుగులోకి వచ్చింది.
చదవండి: సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ.. ఐపీఎల్ నుంచి రూ. 4 కోట్ల ప్లేయర్ అవుట్


