భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను వ్యాఖ్య
రాయ్పూర్: ఒలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో రజత పతకం నెగ్గిన భారత స్టార్ మహిళా వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు ఆసియా క్రీడల పతకమే లోటుగా ఉంది. ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడల్లో ఎన్నో పతకాలు గెలిచినప్పటికీ ఈ ఆసియా పతకంతోనే తన కెరీర్ పరిపూర్ణమవుతుందని ఆమె భావిస్తోంది. దశాబ్దకాలంగా ఇంటాబయట స్వర్ణ, రజత పతకాలు సాధిస్తోన్న ఈ స్టార్ వెయిట్లిఫ్టర్ ఈ ఏడాది ఎలాగైనా అందని ద్రాక్షగా ఉన్న ఆసియా క్రీడల పతకాన్ని గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేసింది.
‘ఖేలో ఇండియా’ గిరిజనుల క్రీడల ప్రారం¿ోత్సవంలో పాల్గొనేందుకు వచి్చన ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మణిపూర్ లిఫ్టర్ మాట్లాడూతూ ‘వ్యక్తిగతంగా నాకు ఆసియా క్రీడలు చాలా కీలకమైన ఈవెంట్. నా సుదీర్ఘ కెరీర్లో ఇక్కడ పతకం సాధించలేకపోయాను. ఏషియాడ్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈవెంట్ ఏదైనా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. దీనికి తగ్గట్లే అథ్లెట్లు సిద్ధమై వస్తారు. ఈ ఏడాది జరిగే ఆసియా ఈవెంట్ కూడా అలాగే జరుగుతుంది’ అని తెలిపింది. రెగ్యులర్గా 48 కేజీల విభాగంలో తలపడే మీరా ఆసియా క్రీడల్లో మాత్రం 49 కేజీల కేటగిరీలో బరిలోకి దిగాల్సి ఉంటుంది.
‘కామన్వెల్త్ గేమ్స్ వరకు 48 కేజీల ఈవెంట్కు తగిన కసరత్తు చేసే నేను రెండు నెలల వ్యవధిలో జరిగే ఆసియా క్రీడల కోసం 49 కేజీల కేటగిరీ మారాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టమైనా నాకెలాంటి ఇబ్బంది లేదు. పతకమే నా లక్ష్యం అయినప్పుడు ఇలాంటివన్నీ భారం కావు’ అని ఆమె వివరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ క్రీడలు యువ అథ్లెట్లకు వరమని, తమ కలల్ని సాకారం చేసుకునే ప్రక్రియకు ఇది తొలి అడుగని మీరాబాయి చెప్పుకొచ్చింది. ఖేలో ఇండియాలో గ్రామీణ క్రీడలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయమని చెప్పింది.
‘ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల పల్లెలు, రిమోట్ ఏరియాలకు చెందిన ఔత్సాహిక క్రీడాకారులు తమ ప్రతిభ చాటేందుకు ‘ఖేలో ఇండియా’ చక్కని వేదిక. ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంత ప్రతిభావంతులు జాతీయ స్థాయిలో వెలిగేందుకు ఈ తరహా ఈవెంట్ దోహదం చేస్తుంది’ అని మీరాబాయి వివరించింది. ఎక్సలెన్సీ కేంద్రాలు (ఎన్సీఓఈ) ప్రతిభ గల అథ్లెట్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొంది.
మన ‘మీరా’ ఘనతలివి...
31 ఏళ్ల మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించింది. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో బంగారు పతకం నెగ్గిన ఆమె తదుపరి 2022, 2025 ఈవెంట్లలో రెండు రజతాలు సాధించింది. 2014 కామన్వెల్స్ క్రీడల్లో రజతం గెలిచాక... తర్వాత గోల్డ్కోస్ట్ (2018), బర్మింగ్హామ్ (2022) క్రీడల్లో పసిడి పతకాలతో సత్తాచాటుకుంది.
కామన్వెల్త్ చాంపియన్షిప్లో నాలుగుసార్లు (2013, 2017, 2019, 2025) చాంపియన్గా నిలిచింది. 2015లో మాత్రం రజతంతో సరిపెట్టుకుంది. తాషె్కంట్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్ (2020)లో కాంస్యం, గువాహటి వేదికగా జరిగిన దక్షిణాసియా క్రీడల్లో (2016) స్వర్ణం నెగ్గింది.


