ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులేకు టీమిండియాలో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్ స్పిన్నర్ను టీమిండియా ప్రత్యేక స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్ 2) అధికారికంగా ప్రకటించింది.
మాజీ టీమిండియా ఆటగాడిగా, దేశీయ క్రికెట్లో దిగ్గజ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన బహుతులేకు ఆటగాడిగా, కోచ్గా విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ నేపథ్యంలో భారత జట్టు స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది.
బహుతులే భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్క్లాస్ కెరీర్లో 6,176 పరుగులు చేసి, 630 వికెట్లు సాధించి దేశీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకరిగా నిలిచాడు.
కోచ్గా కూడా బహుతులే విజయవంతమైన ప్రయాణం కొనసాగించాడు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ దేశవాలీ జట్లకు హెడ్ కోచ్గా సేవలందించాడు. అలాగే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు సుదీర్ఘంగా స్పిన్ బౌలింగ్ కోచ్గా పని చేశాడు.
భారత క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ బహుతులే కీలక పాత్ర పోషించాడు. 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2024 అండర్-19 ప్రపంచకప్లో కూడా కోచింగ్ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండియా-ఏ, సీనియర్ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్ కోచ్గా పని చేశాడు.
2021 నుంచి 2024 వరకు బీసీసీఐ నిర్వహించే నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)లో కూడా కోచింగ్ బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి బీసీసీఐని ఆకట్టుకుంది.
తన నియామకంపై స్పందించిన సాయిరాజ్ బహుతులే, భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు. ఆటగాడిగా భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఎంత గర్వకారణమో, కోచ్గా సేవలందించడం కూడా అంతే ప్రత్యేకమని అన్నాడు.


