లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేష్ ఖాన్కు పేరుకు తగ్గట్టే అవేషం ఎక్కువే. గతంలో తన చర్యలతో భారీ జరిమానా ఎదుర్కొన్న అవేష్ ఖాన్.. ఇప్పుడు మరోసారి తన అత్యుత్సాహంతో చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి.
అసలేం జరిగింది?
ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో లక్నో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. జయదేవ్ ఉనద్కట్ వేసిన ఆ ఓవర్లో తొలి రెండు బంతులను పంత్ బౌండరీలగా మలిచాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాతి రెండు బంతులకు ఎలాంటి పరుగు కాలేదు. ఐదో బంతిని పంత్ మిడ్-ఆఫ్ మీదుగా బౌండరీకి తరలించాడు. అయితే ఆ బంతి బౌండరీ లైన్ను తాకకముందే, డగౌట్ వద్ద అవేష్ ఖాన్ అత్యుత్సాహం ప్రదర్శరించాడు.
తదుపరి బ్యాటింగ్ కోసం ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్న ఆవేష్ ఖాన్.. బయటి నుండి బ్యాట్తో ఆ బంతిని కొట్టాడు. కానీ దీన్ని ఎవరూ గమనించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచినట్టు నిర్థారించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఇది గమనించి ఫిర్యాదు ఉంటే లక్నోకు ఐదు పరుగులు పెనాల్టీ పడేదని అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు.
రూల్స్ ఏమి చెబుతున్నాయి?
నిబంధనల ప్రకారం.. బంతి లైన్ దాటకముందే బయటి ఉన్న వ్యక్తి తాకకూడదు. లా 20.4.2: మైదానం బయట ఉన్న వ్యక్తి ఆటలో జోక్యం చేసుకుంటే, అంపైర్ ఆ బంతిని 'డెడ్ బాల్'గా ప్రకటించవచ్చు. అంతేకాకుండా లా 41 (అన్ఫెయిర్ ప్లే) ప్రకారం.. ఆ బంతిని రద్దు చేసి సదరు జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు.
అయితే అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు చేసినా అంపైర్లు పరిగణలోకి తీసుకోపోయేవారని విశ్లేషకులు చెబుతున్నారు.
బీసీసీఐకి సన్రైజర్స్ ఫిర్యాదు?
అయితే ఘటన మాత్రమే కాకుండా, ఈ సీజన్ లో జరిగిన మరికొన్ని అంపైరింగ్ నిర్ణయాలపై సన్రైజర్స్ యాజమాన్యం గుర్రుగా ఉంది. దీనిపై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసే యోచనలో ఎస్ఆర్హెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ అవుట్పై కూడా ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. అదేవిధంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ అవుట్ అయిన తీరు కూడా వివాదస్పదమైంది.


