ఐపీఎల్-2026 సీజన్ అనంతరం టీమిండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరించనుండగా.. అతడి డిప్యూటీగా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు.
ఈ మ్యాచ్కు స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సెలక్షన్ కమిటీ.. అతడి స్దానంలో గుర్నూర్ బ్రార్కు అవకాశమిచ్చింది. అయితే రంజీల్లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీని ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అఫ్గానిస్తాన్తో టెస్ట్ కోసం ఆకిబ్ నబీని బ్యాకప్ ప్లేయర్గా ఎంపిక చేసినట్లు సమాచారం. అతడు గురువారం జట్టుతో కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్లో నెట్బౌలర్గా నబీ తన సేవలను అందించనున్నాడు. రాబోయో విదేశీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని, అతడి బౌలింగ్ నైపుణ్యాలను సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పరిశీలించనున్నారు.
కాగా నబీ రెడ్ బాల్తో ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాడు. గత రెండు రంజీ సీజన్లలో కలిపి నబీ ఏకంగా 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. గత సీజన్లో నబీ 10 మ్యాచ్లు ఆడి 60 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.
అఫ్గానిస్తాన్తో టెస్ట్కు భారత జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబె.


