మహిళల టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే తమ మహిళా జట్టుకు బ్రిటీష్ ఆర్మీతో కలిసి ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ఈసీబీ సిద్దమైంది.
తమ క్రీడాకారుల్లో మానసిక స్థైర్యాన్ని, నిర్ణయాత్మక శక్తిని పెంచేందుకు ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా కాకుల్లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్లో శిక్షణ పొందారు.
ఇప్పుడు అదే బాటలో ఇంగ్లండ్ క్రికెట్ కూడా నడవనుంది. దాదాపు 15 రోజుల పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గోనున్నట్లు తెలుస్తోంది. విస్డెన్ ప్రకారం.. ఈ ఆర్మీ క్యాంప్ కారణంగా ప్రపంచకప్ జట్టులోని 15 మంది సభ్యులు మే 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే కప్ సెకెండ్ రౌండ్కు దూరంగా ఉండనున్నారు.
బ్రిటీష్ ఆర్మీ వద్ద శిక్షణ పొందేందుకు వరల్డ్కప్ జట్టును పంపడం మాకు లభించిన గొప్ప అవకాశం. అక్కడ నేర్చుకునే విషయాలు మైదానంలో పోరాడేందుకు వారికి ఎంతో సహాయపడతాయి అని ఈసీబీ మహిళల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ క్లేర్ కానర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా 2010-11 యాషెస్ సిరీస్ సమయంలో ఇంగ్లండ్ పురుషల జట్టు కూడా ఇలాంటి ఆర్మీ తరహా శిక్షణ (బాక్సింగ్, అటవీ ప్రాంతాల్లో లాంగ్ హైకింగ్) పొందింది.
కాగా జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 12 జట్లు రెండు గ్రూప్లుగా (ఏ, బీ) విడిపోయి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండగా.. గ్రూప్-బిలో స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఉన్నాయి.
ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టు ఇదే
నాట్ సైవర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, ఏమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హెథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వైట్-హాడ్జ్.


