పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకోవడంపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి సోషల్మీడియా వేదికగా పాక్ జట్టును ఏకి పారేస్తున్నారు. పాక్ భారత్ చేతిలో పరాభవాన్ని ముందే ఊహించి జారుకుందని కామెంట్లు చేస్తున్నారు.
అభిషేక్ శర్మ భయంతో పారిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాక్ తమతో మ్యాచ్ ఆడపోవడం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. భారత్తోనే కాదు, టోర్నీ మొత్తానే బాయ్కాట్ చేసుంటే పీడా పోయేదని చర్చించుకుంటున్నారు. భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకున్నందుకు ఐసీసీ కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ టోర్నీలో టీమిండియా తప్పక ఆడింది కానీ, చాలా మంది భారతీయులకు పాక్తో తలపడటం అస్సలు ఇష్టం లేదు. మెజారిటీ శాతం భారతీయుల అభిమతానికి అనుగుణంగానే టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
అలాగే ఆసియా కప్ గెలిచిన తర్వాత పీసీబీ అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్కు చీఫ్ కూడా అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించలేదు. భారత ఆటగాళ్లు ట్రోఫీని అందుకోవడం నిరాకరించినందుక నఖ్వీ ట్రోఫీ ఎత్తుకెళ్లిపోయిన విషయం విధితమే. ఇప్పటికీ అతను భారత్కు ఆ ట్రోఫీని అప్పగించలేదు.
ఈ వివాదం కొనసాగుతుండగానే భారత్-బంగ్లాదేశ్ అంతర్గత విషయంలో పాక్ తలదూర్చింది. బంగ్లాదేశ్కు వత్తాసుగా ప్రపంచకప్ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది. చివరికి భారత్తో మ్యాచ్ను మాత్రమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని ఐసీసీ చాలా సీరియస్గా పరిగణించే అవకాశం ఉంది. క్రికెట్కు సంబంధించి పాక్ను అష్టదిగ్బంధనం చేయవచ్చు. ఆర్దిక, పాలనాపరమైన చాలా శిక్షలను పీసీబీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ జట్టును ప్రపంచకప్ నుంచి బహిష్కరించినా, ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఒకవేళ పాక్ ప్రపంచకప్లో కొనసాగితే భారత్తో మ్యాచ్ రద్దు చేసుకున్నందుకు రెండు పాయింట్లు కోల్పోతుంది. భారత్కు మ్యాచ్ ఆడకుండానే రెండు పాయింట్లు లభిస్తాయి.
ఒకవేళ పాక్ అదృష్టం బాగుండి, తదుపరి దశకు చేరినా, అంతకంటే ముందుకు వెళ్లే సీన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ భారత్తో మ్యాచ్ ఆడినా, ఆడకపోయినా పెద్ద తేడా ఉండదని భారతీయ క్రికెట్ అభిమానులు అంటున్నారు.


