హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవ కమిటీని నియమించారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా పూదరి శ్రీనివాస్గౌడ్, పచ్చిమట్ల రాధాగౌడ్, టాకూర్ భగవాన్ సింగ్, దొబ్బల అనిల్, లావుడ్యా కిషన్నాయక్, కోడం ప్రభాకర్, పున్న సమ్మయ్య, అలవోజు రవీందర్, ముప్పిడి రాజిరెడ్డి, గొర్ల కొమురయ్య, సావుల వెంకటస్వామి, గట్టు సాయికృష్ణ, బొల్లి శ్రీనివాస్లను నియమించారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు ఉత్సవ కమిటీ పని చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పంట వివరాల నమోదు
తప్పనిసరి: స్వరూపరాణి
దుబ్బాకటౌన్: రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. బుధవారం రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లిలో పంట నమోదు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పంట నమోదు చేసుకుంటేనే ఉత్పత్తులు అమ్ముకోవడానికి వీలుంటుందన్నారు. ప్రతి సీజన్లో పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఫర్టిలైజర్ యాప్ అప్డేట్స్ కోసం తాత్కాలికంగా నిలిపి వేశారన్నారు. రైతులకు యూరియా అవసరం ఉంటే నానో యూరియా వాడాలని, అలాగే ఆయిల్పామ్ పంట కోసం అమ్మోనియా సల్ఫేట్ వాడాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి స్వర్ణలత, రైతులు తదితరులున్నారు.
బకాయిలు విడుదల చేయండి
సిద్దిపేటజోన్: పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజు డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. 14లక్షల మంది పేద విద్యార్థులు పథకంపై ఆధారపడి చదువుతున్నారని, వారికి విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు కాలేజీలు హాల్టిక్కెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. బకాయిలు చెల్లించకుండా మరోపక్క ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను 35 శాతం పెంచి పేద విద్యార్థుల తల్లిదండ్రులకు భారం చేసిందన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు.


