సిద్దిపేటరూరల్: సైబర్ క్రైమ్, సమాచార మాధ్యమాలతో ఏర్పడిన చెడు స్నేహాల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వమాట్లాడుతూ అన్ని తెలుసనే భ్రమలో విద్యార్థులు ఉంటారని, ఏది నిజం, ఏది అబద్దం అనేది గ్రహించకుండా త్వరగా అట్రాక్టివ్ అవుతారన్నారు. ఇంటర్నెట్, టెక్నాలజీ అవసరం మేరకు వాడుకోవాలని సూచించారు. వాట్సప్, పలు సోషల్ మీడియాలో రకరకాల కొత్త వారితో ఎక్కువ మంది స్నేహాలు చేస్తుంటారని, దాని వల్ల జీవితం నాశనమయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సైతం చూస్తున్నామన్నారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు పెంచి చదివిస్తున్న క్రమంలో వారి కలలను నిజం చేయాలన్నారు. ఆధ్యాత్మిక భావన, యోగ, ధ్యానం చేసుకుని పాజిటివ్ దృక్పథంతో ఉండాలన్నారు. విద్య పరంగా సమస్యలు ఎదురైతే ఉపాధ్యాయులకు తెలపాలని, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని నిరంతరం శ్రమించి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ బారిన పడకుండా జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద, సీడీపీఓ రాము, ఇన్చార్జి డీఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు.
జీవితాలను నాశనం చేసుకోవద్దు
కలెక్టర్ హైమావతి
నర్సింగ్ విద్యార్థులకు
సైబర్క్రైమ్పై అవగాహన


