అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మండలస్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తేమ శాతం సరైన విధంగా ఉండి కూడా కొనుగోలు చేయలేకపోతే సమస్యలు వస్తాయన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు రావద్దన్నారు. ఆయా గ్రామాల్లో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. బావుల పూడికతీత, పైపులైన్ వేయడం, తదితర అంశాలపై పరిష్కారం చూపడానికి ఐదుగురుతో కమిటీ వేయాలని చెప్పారు. గ్రామాల్లో హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేయాలన్నారు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కమిటీలు బాధ్యతగా వ్యవహరించినప్పుడే గ్రామాల్లో సమస్యలు తొలుగుతాయన్నారు. మండలంలో రూ.14కోట్లతో రోడ్లు వేశామన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. మండలంలోని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సౌజన్య, కలెక్టర్ హైమావతి, ఆర్డీఓ రామ్మూర్తి, ఆత్మ కమిటీ చైర్మన్ ఐల్లయ్య, ఎంపీడీఓ బానోతు జయరాం, ఎమ్మారో సింహాచలం మధుసూదన్, ఎంఈఓ గుగులోతు రంగా నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగాలి
ప్రతి గ్రామంలో
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్


