
ఉద్యాన వర్సిటీలో ముగిసిన సదస్సు
ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రెండురోజులుగా నిర్వహించిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. సదస్సులో వనరుల పరిరక్షణ, పర్యావరణ మార్పుల ప్రభావం, ఉద్యాన రంగంలో వ్యూహాలు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. వాతావరణ మార్పులకు కారణంగా వచ్చే ఉద్యాన పంటల ప్రభావాలను ఎలా తగ్గించవచ్చు, అనువర్తాల వైవిధ్యాన్ని ఏవిధంగా పెంచుకోవచ్చు, భవిష్యత్తులో ఉద్యాన రంగంలో సాధించాల్సిన లక్ష్యాలపై చర్చించారు. సదస్సులో విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి సందర్శించి ప్రదర్శనలను తిలకించారు. కార్యక్రమంలో యునివర్సిటీ అధికారులు భగవాన్, సురేశ్కుమార్, లక్ష్మీనారాయణ, రాజశేఖర్, శ్రీనివాసన్, విజయ తదితరులు పాల్గొన్నారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): ఈదురు గాలులతో కూడిన వర్షానికి శుక్రవారం మండల పరిధిలోని మాచాపూర్లో రెండు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్ల సమీపంలో భారీ చెట్లు పడటంతో ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపడి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
వర్గల్(గజ్వేల్): తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన గౌరారం చిన్నారులకు అండగా ఉంటామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పిల్లలను పరామర్శించి ఓదార్చారు. రూ.36,000 ఆర్థికసాయం అందజేశారు. రెండు నెలల వ్యవధిలో చిన్నారుల తల్లిదండ్రులు, అమ్మమ్మ మృతి బాధకరమన్నారు. పిల్లల దైన్యస్థితి ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం డిమాండ్
సిద్దిపేట రూరల్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పశువైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పశువైద్యాధికారిపై ‘సాక్షి’లో ప్రచురితమైన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలన్నారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో గొర్రెల కాపరుల్లో ఆందోళన నెలకొందన్నారు. తక్షణమే దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. అండర్ 14 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో సిద్దిపేటఅర్బన్, ద్వితీయ స్థానంలో దౌల్తాబాద్, తృతీయ స్థానం చిన్నకోడూరు, నాల్గవ స్థానంలో నంగునూరు మండలాలు నిలిచాయి. అండర్–17 బాలుర విభాగంలో దుబ్బాక ప్రథమ, హుస్నాబాద్ ద్వితీయ, తృతీయ స్థానంలో జగదేవ్పూర్ నిలిచాయి. అండర్–14 బాలికల విభాగంలో కూకునూరుపల్లి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో హుస్నాబాద్, తృతీయ స్థానంలో ధూళ్మిట్ట మండలాలు నిలిచాయి.

ఉద్యాన వర్సిటీలో ముగిసిన సదస్సు

ఉద్యాన వర్సిటీలో ముగిసిన సదస్సు