
మాయం
బియ్యం..
మిల్లర్ల మాయాజాలం
మిల్లులో సీఎంఆర్ చేస్తున్న బియ్యం
ధాన్యాన్ని సీఎంఆర్ చేసి ఇవ్వాల్సిన బియ్యాన్ని పలువురు మిల్లర్లు మింగేశారు. సివిల్ సప్లయ్ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. కేసు నమోదై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సదరు మిల్లుల యజమానుల నుంచి రికవరీ చేయలేదు. రికవరీ జాప్యంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారులు స్పందించి బియ్యాన్ని రికవరీ చేయాలన్న డిమాండ్ సర్వత్రా పెరుగుతోంది.
– సాక్షి, సిద్దిపేట
యాసంగి(2023–24)కి కేటాయించిన ధాన్యం నుంచి 2,19,757 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా 2,15,212 మెట్రిక్ టన్నులే అందించారు. ఇంకా 4,545 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల దగ్గరే ఉన్నాయి. అందులో రాయపోలు మండలం వడ్డెపల్లికి చెందిన సాయి వీరభద్ర రైస్ మిల్లు 4,040 మెట్రిక్ టన్నులు, కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన శ్రీనివా స రైస్మిల్లు 293 మెట్రిక్ టన్నులు, సిద్దిపేటలో నర్సాపూర్లో హిమజా రైస్ మిల్లు 30 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. సాయి వీరభద్ర, శ్రీనివాస మిల్లులపై సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
ఖరీఫ్ సీఎంఆర్ పెండింగ్
మిల్లులకు 2024–25లో 2,84,755 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. దీంతో 1,91,768 టన్ను ల బియ్యాన్ని సీఎంఆర్ చేసి అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,25,030 మెట్రిక్ టన్నులు ఇంకా పెండింగ్లో ఉంది. ఈ బియ్యం మే 31వ తేదీ వరకే సివిల్ సప్లయ్కి అందించాలి. గడువు ముగిసి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు అందించలేదు. అసలు ధాన్యం ఉందా? లేదా? అనే విషయంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సీఎంఆర్ బియ్యం మాయం చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
కానరాని తనిఖీలు
మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని నిత్యం అధికారులు తనిఖీలు చేయకపోవడంతోనే బియ్యం మాయమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్లో ఎంత ధాన్యం కేటాయించారు? ఎంత బియ్యం అందించారు? ఇంకా ఎంత బకాయి ఉంది? అనే విషయాలు పరిశీలించాలి. మిల్లులో ఎంత ధాన్యం స్టాక్ ఉందో పరిశీలిస్తే మొదటనే మిల్లర్ల మోసంను గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. ఇలా నిత్యం తనిఖీలు చేయడం వల్ల బియ్యం గోల్మాల్ జరగకుండా అరికట్టవచ్చు.
రివకరీలో జాప్యం
బకాయిపడిన బియ్యం అందించకపోవడంతో సివిల్ సప్లయ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో ఫిబ్రవరిలో ఆయా మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు కోసం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయాలని ఆయా తహసీల్దార్లకు అదేశాలిచ్చారు. అలాగే ఆయా మిల్లుల యజమానుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని, ఆస్తుల మార్పిడి జరగకుండా చూడాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నారు. సీఎంఆర్కు సంబంధించిన బియ్యం ఇవ్వకుండా వాడేసుకున్న మిల్లర్ల నుంచి రికవరీలో ఎందుకు జాప్యం చేస్తున్నారో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గడువు ముగిసినా అప్పగించని వైనం రెండు మిల్లులపై క్రిమినల్ కేసులు సాయి వీరభద్ర రైస్ మిల్లు4వేల మెట్రిక్ టన్నులు బకాయి తనిఖీలు లేకపోవడం వల్లే గోల్మాల్
రివకరీ చేస్తాం
సీఎంఆర్ బియ్యం అందించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మిల్లు యజమానులకు సంబంధించిన ఆస్తులను మార్పిడి చేయకుండా చర్యలు తీసుకున్నాం. ఆర్ఆర్ యాక్ట్ కింద మిల్లుల యజమానుల నుంచి త్వరలో రికవరీ చేస్తాం.
– ప్రవీణ్, డీఎం,
సివిల్ సప్లయ్ కార్పొరేషన్

మాయం