
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా
బీసీ వెల్ఫేర్ జిల్లా ఇన్చార్జి నాగరాజమ్మ
చిన్నకోడూరు(సిద్దిపేట): బీసీ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి మెరుగైన వసతులు కల్పిస్తామని బీసీ వెల్ఫేర్ జిల్లా ఇన్చార్జి నాగరాజమ్మ పేర్కొన్నారు. చిన్నకోడూరులోని బీసీ హాస్టల్ విద్యార్థులు తమకు రుచికరమైన భోజనం అందివ్వడంలేదని కలెక్టర్కు ఫిర్యాదు చేయగా మంగళవారం ఆమె బీసీ హాస్టల్ను సందర్శించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజులుగా హాస్టల్లో అల్పాహారం, భోజనం సరిగ్గా పెట్టడం లేదని, ఇందులో పని చేసే వర్కర్ రాధ తమపై అకారణంగా దుర్భాషలాడుతుందని విద్యార్థులు వివరించారు. బడిలో ప్రధానోపాధ్యాయుడు మిగతా విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులను వేర్వేరుగా చేసి చూస్తున్నారని తమకు అవమానంగా ఉందని వివరించారు. వెంటనే ఆమె పాఠశాలను సందర్శించి హెచ్ఎం, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండాచూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బాపురాజు, వార్డెన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
డీఎంహెచ్ఓ ధనరాజ్
మద్దూరు(హుస్నాబాద్): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి ధనరాజ్ స్పష్టం చేశారు. మండల కేంద్రంతో పాటు లద్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనీఖీ చేశారు. ఈ సందర్భగా ఆయన రికార్డులను పరిశీలించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...వర్షపు నీరు కలుషితం కావడం వల్ల నీళ్ల విరేచనాలు గ్యాస్ట్రో ఎంట్రైటీస్,కీటక జనిత వ్యాధులకు సంబంధించిన నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ మంగళ,శుక్రవారాలు డ్రైడేగా పాటించాలని సూచించారు. నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రజిత,సుధీర్రాజ్,అర్జున్,మహేందర్ పాల్గొన్నారు.
కేజీబీవీలో కుక్పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మిరుదొడ్డి(దుబ్బాక): మిరుదొడ్డిలోని కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం)లో రెండు సహాయ వంట మనుషుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంఈఓ ప్రవీణ్ బాబు తెలిపారు. మిరుదొడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...7వ తరగతి కనీస విద్యార్హత కలిగిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6, 7 తేదీలల్లో సంబంధిత కేజీబీవీలో దరఖాస్తులను అందజేయాలని కోరారు.
సీపీఎస్ రద్దు చేయాలి
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి
దుబ్బాక: ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుకు సెప్టెంబర్ 1న పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 10 వేల మందితో నిర్వహించనున్న ధర్నాకు ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీఆర్టీయూ దుబ్బాక అర్బన్, రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలల్లో సభ్యత్వనమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2003 ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానం కోసం పోరాడుతున్నామన్నారు. ఉపాధ్యాయులతోపాటు విద్యరంగ సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా