
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ అనురాధ సూచించారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో సైబర్ వారియర్స్కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వచ్చిన టీషర్ట్స్ను సీపీ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సైబర్ వారియర్స్కు వచ్చే ఫోన్ కాల్స్కు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సైబర్ కేసుల్లో పూర్తి ఆధారాలు సేకరించి నేరస్తులను గుర్తించడం, నేరగాళ్లకు శిక్షలు పడేలా చేయడమనేది సైబర్ వారియర్స్ చాలెంజ్గా స్వీకరించాలని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లాలోని సైబర్ వారియర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యూడీఐడీ క్యాంపును
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ఆర్యా
సిద్దిపేటరూరల్: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు యూడీఐడీ దివ్యాంగుల శిబిరానికి హాజరై గుర్తింపు కార్డును పొందాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి జయదేవ్ ఆర్యా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నడవలేని వారికి ఆగస్టు 14, 28వ తేదీల్లో, మానసిక, కంటిచూపు, వినికిడి సమస్యలున్న వారికి 07,21,28వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు అనంతరం వారికి కేటాయించిన సమయానికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు దగ్గరలో గల ప్రభుత్వాస్పత్రికి ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
నకిలీ ఎరువుల
దందాను అరికట్టాలి
రైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి
కొమురవెల్లి(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోన్న నకిలీ ఎరువుల దందాను వ్యవసాయ అధికారులు అరికట్టాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రైతు సంఘం కార్యాలయంలో సంఘం నాయకులతో కలసి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేరున్న కంపెనీల ఎరువుల బస్తాలకు కృతిమ కొరత సృష్టించి ,అధిక లాభాల కోసం నాసిరకం ఎరువులు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కొంతకాలంగా నాసిరకం విక్రయాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, వుల్లంపల్లి సాయిలు, తాడూరి మల్లేశం, నూకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జ్వర పరీక్షలు నిర్వహించాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: ఆరోగ్య కేంద్రానికి జ్వర లక్షణాలతో వచ్చే వారి నుంచి రక్త నమూనాలను సేకరించి టీహబ్కు పంపించి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సబ్ యూనిట్ అధికారులు, ఎల్టీలు, సూపర్వైజర్లతో సోమవారం డీఎంహెచ్ఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెంగ్యూ, మలేరియా నిర్థారణ పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సోఫాన్ రాథోడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి