
సాగునీటి ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం
● రెండేళ్లుగడుస్తున్నా ముందుకు సాగని పనులు ● ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి
తొగుట(దుబ్బాక): సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. మల్లన్న సాగర్ అనుబంధంగా మండలంలోని ఎల్లారెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న మినీ పంప్హౌజ్, పైప్లైన్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుసేన్ మనవలు ఎండీ కరీమోద్దిన్,యాసీనుద్దిన్, మనవరాలు అయేషా సుల్తానాల పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఘనపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ఉప కాలువలు నిర్మించాలని పలుమార్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్కోడ్ పైపు లైన్ పనులు 90% బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిచేసిందన్నారు. మిగిలిపోయిన పనులు రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయలేదని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మల్లన్న సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప కాలువ పనులు వేంటనే పూర్తిచేయాలని లేకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
విద్య, వైద్యం ఉచితం చేయాలి
పేదలకు విద్య, వైద్యం అందనిద్రాక్షలా మారిందని, ఆ రెండింటినీ ఉచితంగా అందించాలని ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. నేడు ప్రతీ ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వ్యవస్థల్లో మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందు తొగుటలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరిని పరామర్శించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మండలంలోని ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.