
నీట్ పీజీ పరీక్షకు 48 మంది హాజరు
సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సీబీటీ విధానంలో ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 48 మంది హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. డాక్టర్ నౌషీన్, డాక్టర్ స్రవంతి, టీసీఎస్ ఆఫీసర్ అఫ్సర్, పీఆర్వో బొడ్డు రఘు, సిస్టం అడ్మిన్ షాదుల్లా, కరీముద్దీన్ పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించారు.
పొన్నాల బాలయ్యకు సినారె పురస్కారం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట చెందిన ప్రముఖ కవి రచయిత పొన్నాల బాలయ్య ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఉత్సవంలో మహాకవి సినారె సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ మేరకు మంజీర రచయితల సంస్థ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాదులో సినారె కళాపీఠం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగిన ఉత్సవంలో ఈ పురస్కారాన్ని బాలయ్యకు ప్రదానం చేశారు.
మల్టీ పర్పస్ విధానాన్ని
రద్దు చేయాలి: సీఐటీయూ
నంగునూరు(సిద్దిపేట): పంచాయతీ కార్మికులకు అమలు చేస్తున్న మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. నంగునూరులో ఆదివారం పంచా యతీ కార్మికుల ప్రత్యేక సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవులపల్లి రాజమౌళి, ప్రధాన కార్యదర్శిగా కనకయ్య, కోశాధికారిగా రవీందర్, ఉపాధ్యక్షులుగా కనకవ్వ, రేణుక, కనకయ్య, సహాయ కార్యదర్శులుగా బాలయ్య, నర్సవ్వ, యాదవ్వ ఎన్నికయ్యారు.
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కంప్యూటర్ సైన్స్–2, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్–3, సివిల్ ఇంజినీరింగ్–4, ఫిజిక్స్–1, మ్యాథ్స్–1, కెమిస్ట్రీ–1 పోస్టుల కోసం అర్హతగల అభ్యర్థులు ఈ నెల 2 నుంచి 5 వరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెక్నికల్ విభాగాల కోసం బీఈ, బీటెక్లో ఫస్టు క్లాసులో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఎంటెక్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.
సీఎం రేవంత్ మోసకారి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ
గజ్వేల్: అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా... దివ్యాంగులు, వృద్ధుల పింఛన్లు పెంచకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశంలోనే మోసకారి ముఖ్యమంత్రిగా ఖ్యాతిని గడించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆరోపించారు. హైదరాబాద్లో దివ్యాంగులు, వృద్ధులు ఫించన్ల పెంపును డిమాండ్ చేస్తూ ఈనెల 13న నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం గజ్వేల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచుతానని చెప్పిన సీఎం..20నెలలుగా రూ. 20వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఈ నిధులను రుణమాఫీకి మళ్లించారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు భూమయ్యయాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

నీట్ పీజీ పరీక్షకు 48 మంది హాజరు

నీట్ పీజీ పరీక్షకు 48 మంది హాజరు