
ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచండి
● సాగు విస్తీర్ణం మేరకే ఎరువులు ● కలెక్టర్ హైమావతి
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
కొమురవెల్లి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిర్ణీత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి లబ్ధిదారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీడీవో శ్రీనివాసవర్మతో కలిసి నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం , ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గొర్రెలకు ఇచ్చే బ్లూటాంగ్ వ్యాక్సిన్ ప్రకియను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ సమయంలో మెడికల్ ఆఫీసర్ సెలవులో ఉన్నాడని డ్యూటీ నర్సు తెలుపడంతో జిల్లా వైద్యాధికారికి ఫోన్చేసి సెలవు మంజూరుపై ఆరా తీశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పప్పు ఉడకకపోవడంతో వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలోని సేల్స్ రిజిస్టర్ను పరిశీలించి రైతులకు విస్తీర్ణం ప్రకార మే ఎరువులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి హరీశ్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాను ఆదర్శంగా నిలపాలి
సిద్దిపేటరూరల్: జిల్లాలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉద్యాన, వ్యవసాయ, ఆయిల్ ఫెడ్ శాఖల అధికారులతో ఆయిల్ పామ్ సాగు, ఫార్మర్ రిజిస్ట్రీ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుపై ఉత్సాహం చూపుతున్న రైతులను ప్రోత్సహించడంతోపాటు మండల వ్యవసాయ అధికారులకు నిర్దేశించిన మేర సాగు జరిగేలా ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఉద్యానవనశాఖ అధికారి సువర్ణ, వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి, టీజీ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రశాంత్నగర్(సిద్దిపేట): గురుకుల విద్యార్థులకు నాణ్యమైన, బలవర్థకమైన అహారం అందించాలని, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతిపూలే బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, స్టోర్ రూమ్ గల సరుకులను, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు కచ్చితంగా మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అనంతరం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూం కాలనీలోని గ్రంఽథాలయంను పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని మున్సిపల్, హౌసింగ్ అధికారులను ఆదేశించారు.

ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచండి