
గ్రూపులుంటేనే మజా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /వట్పల్లి : రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు, గ్రూపులు లేకుంటే ఆ పార్టీ అభివృద్ధి చెందదని, గ్రూపులు ఉంటేనే ఉత్సాహం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. గ్రూపు తగాదాలు లక్ష్మణ రేఖ దాటవద్దని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉంటాయని, ఎన్నికలు వస్తే అన్ని గ్రూపులు ఒక్కటై పోరాడి విజయం సాధించాలని హితవు పలికారు. తాము మాత్రం అన్ని గ్రూపులకు సమాన ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు శనివారం జోగిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సంగుపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. పార్టీకి కొత్త నీరు కూడా అవసరమని అందుకే 15% కొత్తవారిని కూడా తీసుకుంటున్నామని, పాత, కొత్తలతో ముందుకు సాగుతున్నామన్నారు.
సర్వేల ఆధారంగానే స్థానిక టికెట్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగానే కేటాయింపు ఉంటుందని మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్