
లాభసాటి సాగుపై దృష్టి సారించండి
హుస్నాబాద్: రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ, పంట మార్పిడిలు చేస్తూ లాభాల వైపు పయనించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో మూడు రోజుల పాటు జరిగిన రైతు మహోత్సవ ముంగిపు సభ ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ముంగింపు కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు తాను రావాల్సి ఉండేదని, కేబినెట్ విస్తరణ కారణంగా రాలేకపోయామన్నారు. రైతు మహోత్సవంలో చెప్పిన అంశాలను క్షేత్ర స్ధాయిలో పాటించి వ్యవసాయాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి సూచించారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
పంటల ఉత్పత్తిని పెంచుకోవాలి
రైతు మహోత్సవ కార్యక్రమంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, జనగామ జిల్లాల నుంచి వచ్చిన రైతులు మూడు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. వ్యవసాయంలో లేటెస్ట్ టెక్నాలజీ, వివిధ మార్పుల గురించి క్లుప్తంగా తెలుసుకున్నారని తెలిపారు. చేపలు, గేదెలు, ఆవులు, కోళ్ళ వ్యర్థాలతో పంటల ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వరి పంటలోకి మళ్లించడం ద్వారా 30 శాతం అధికంగా దిగుబడి పెరుగుతుందన్నారు. అరటి సాగులో మొక్కలను దగ్గర దగ్గర నాటాలన్నారు. మొక్కల కొమ్మలు ఒకటి కొకటి తాకడం వల్ల తేమ బయటకు పోకుండా అందులోనే స్టోరేజి అయి దిగుబడి ఎక్కువగా వస్తుందని తెలిపారు. ఈ పద్ధతి మహారాష్ట్రలోని జలగామ్ జిల్లా రైతులు పాటిస్తూ దేశంలోనే 13 శాతం, ప్రపంచంలోనే 2 శాతం అరటిని ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. వాతావరణానికి అనుగుణంగా కొంచెం ఆలోచిస్తే ఎంతో లాభాలు పొందవచ్చని అక్కడి రైతులు నిరూపించారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, బ్యాంకింగ్, ఇతర ప్రైవేట్ రంగాల నుంచి ప్రతినిధులు భాగస్వామ్యం అయినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ను వివిధ శాఖల అధికారులు, రైతులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నూతన పద్ధతులు అవలంబించాలి
కలెక్టర్ మనుచౌదరి
ఫోన్ ద్వారా మంత్రి పొన్నం సందేశం