సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్లో సత్వర న్యాయం జరుగుతుందని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సివిల్, క్రిమినల్, రోడ్డు ప్రమాద, కుటుంబ పరమైన కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ నెల 14న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నందున కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీపడేట్లు చూడాలన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని అన్నారు.
‘భగీరథ’ కోసం రోడ్డెక్కిన మహిళలు
ఖాళీ బిందెలతో నిరసన
మర్కూక్(గజ్వేల్): మిషన్ భగీరథ నీరు 15 రోజులుగా రాకపోవడంతో మహిళలు రోడ్డెక్కారు. మండలంలోని వర్దరాజ్ పూర్లో ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. బోరు బావుల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఒక్క మోటారు కాలిపోవడంతో బాగు చేయించేవారే కరువయ్యారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే భగీరథ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సిద్దిపేట అభివృద్ధికి రూ.2.60 కోట్లు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.60కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 9 కొత్త గ్రామపంచాయతీల కోసం రూ.1 80కోట్లు, 10 కొత్త అంగన్వాడీలకు రూ.80 లక్షలు నిధులు విడుదలయ్యాయన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బొమ్మల యాదగిరి, రాష్ట్ర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే బీజేపీ ధ్యేయం
ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో అనేక అద్భుతాలు జరిగాయని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పీఎం మోదీ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. రైతులకు అండగా నిలిచేది బీజేపీయేనన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధిచెందుతున్నాయన్నారు. ప్రతీ కార్యకర్తల కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూదిశ్రీకాంత్రెడ్డి, రాంచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు శంకర్, సిద్దిపేట పట్టణ అధ్యక్షులు వెంకట్, సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్తో సత్వర న్యాయం