
ట్రిపుల్ఆర్ భూబాధితుల ఆక్రోశం
రూ.కోట్లు పలికే భూములకు అత్తెసరు పరిహారం ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారంటూ ట్రిపుల్ఆర్ భూ బాధితుల్లో ఆక్రోశం వ్యక్తమవుతోంది. భూముల ప్రభుత్వ విలువపై పట్టణ ప్రాంతాల్లో రెండింతలు, గ్రామీణ ప్రాంతాల్లో మూడింతలు ఇవ్వనున్నట్లు సంకేతాలు వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 4,832ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. మే లేదా జూన్ నెలలో భూముల స్వాధీనానికి రంగం కూడా సిద్ధమైంది. పరిహారం తేల్చకుండానే అధికారుల కార్యాచరణ వేగవంతం చేయడంతో బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
గజ్వేల్: ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం భూబాధితుల పరిహారం లెక్కల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. రూ.కోట్ల విలువైన భూములకు పొంతన లేని పరిహారం ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుండటమే కారణం. ట్రిపుల్ఆర్ భూసేకరణ కోసం రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా (కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి పరిధిలో మూడు కాలాలతోపాటు గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84గ్రామాల్లో 4832.5ఎకరాల వరకు భూసేకరణ లక్ష్యంగా ఉండగా, ఇందులో దాదాపుగా సేకరించారు. ఇందులో 180 ఎకరాల అటవీ భూమి, మరో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
పొంతనలేని లెక్కలు
సేకరిస్తున్న భూమికి ప్రభుత్వ విలువపై రెండు లేదా మూడింతలు మాత్రమే పరిహారం ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉత్తర భాగంలో ప్రభుత్వ విలువ ప్రకారం చూస్తే సంగారెడ్డి ప్రాంతంలోని కొన్ని సర్వే నంబర్లల్లోని భూమి అత్యధికంగా రూ.75లక్షలు పలుకుతోంది. ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే రూ.1.5కోట్ల పరిహారం అందే అవకాశం ఉంది. నిజానికి ఈ భూమికి బహిరంగ మార్కెట్లో ధరను పరిశీలిస్తే.. రూ.10కోట్లకుపైనే ఉంటుంది. ప్రభుత్వ విలువ ప్రకారం చూస్తే చౌటుప్పల్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ఎకరాకు అత్యధికంగా రూ.20లక్షల నుంచి రూ.50లక్షల విలువ కలిగిన భూములు ఉన్నాయి. నిజానికి బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.5నుంచి 7కోట్ల వరకు పలికే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల గరిష్టంగా రూ.10లక్షలకుపైగా ప్రభుత్వ విలువ కలిగిన భూములు ఉన్నాయి. కానీ భూములకు మార్కెట్ ధరతో పోలిస్తే పొంతన లేని పరిహారం పొందే అవకాశముంది. ముఖ్యమైన విషయమేటంటే భూముల ప్రభుత్వ విలువల పెంపు శాసీ్త్రయంగా జరగకపోవడం కూడా బాధితుల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
సామలపల్లిలో ట్రిపుల్ఆర్ నిర్మాణం వల్ల సర్వం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
ప్రభుత్వ విలువపై రెండు లేదా మూడింతలే..
ఎన్హెచ్ యాక్ట్ ప్రకారం ముందుకు
ఉత్తర భాగంలో 4,832 ఎకరాల భూసేకరణ పూర్తి
భూముల స్వాధీనానికి రంగం సిద్ధం
అదనపు భూసేకరణ
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో 11చోట్ల ఇంటర్ఛేంజ్ల నిర్మాణం చేపట్టాలని నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. వీటి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రస్తుత హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు కంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పలు ఇంటర్ఛేంజ్ల వద్ద అదనపు భూసేకరణ అవసరమవుతోంది. దీంతో ఇంటర్చేంజ్ ప్రదేశాల్లోనూ బాధిత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ట్రిపుల్ఆర్ భూబాధితుల ఆక్రోశం