తహసీల్దార్‌గా హసీనా బేగం | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌గా హసీనా బేగం

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

కంది(సంగారెడ్డి): మండల తహసీల్దార్‌గా హసీనా బేగం నియామకమయ్యారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన తహసీల్దార్‌ రవికుమార్‌ ములుగు డీఆర్‌ఓగా బదిలీపై వెళ్లారు. దీంతో నారాయణఖేడ్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న హసీనా బేగం కందికి బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేద్దాం

నారాయణఖేడ్‌: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్‌ఎస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పార్టీ సభ్యత్వ నమోదు ఖేడ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కోరారు. పట్టణంలో మంగళవారం సభ్యత్వ నమోదు, జనగణనపై మండల సమన్వయకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైనందున ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌ వైపు ఆశగా చూస్తున్నారన్నారు.

కూలీలకు ఓఆర్‌ఎస్‌, జ్యూస్‌ పంపిణీ

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు, కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని గుంజోటి సర్పంచ్‌ దెశెట్టి పాటిల్‌ కోరారు. మంగళవారం పంట పొలాల వద్ద పని చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన ఆయన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జ్యూస్‌ అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎఫ్‌ఏ తదితరులు పాల్గొన్నారు.

దర్గాలో ప్రత్యేక పూజలు

మునిపల్లి(అందోల్‌): మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులో ఉన్న ఇస్మాల్‌ ఖాదీర్‌ దర్గాలో మంగళవారం మాజీ ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. కాగా, ఇస్మాల్‌ ఖాధీర్‌ దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

మల్‌చెల్మలో వారాంతపు సంత

జహీరాబాద్‌ టౌన్‌: మండలంలోని మల్‌చెల్మలో వారాంతపు సంతను మంగళవారం సర్పంచ్‌ పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి వారాంతపు సంత భాగమేనని చెప్పారు. గ్రామంలో వారాంతపు సంత నిర్వహించడంతో ప్రజలు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశాబ్దాల క్రితం గ్రామంలో సంత జరిగేదని గుర్తు చేశారు.

హరీష్‌ రావును కలిసిన మాజీ కార్పొరేటర్‌

రామచంద్రాపురం(పటాన్‌చెరు): మాజీ మంత్రి హరీష్‌రావును ఆయన నివాసంలో భారతినగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సింధు రెడ్డి, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్‌ రెడ్డి మంగళవారం కలిశారు. ఈ మేరకు సింధు రెడ్డి దంపతులు హరీష్‌రావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్‌ రావును కలిసి పుట్టికరోజు శభాకాంక్షలు తెలిపినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement