నారాయణఖేడ్: అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు కేటాయించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే పనులు ప్రారంభించిందన్నారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు మిగులు రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుతో అప్పగించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుని ప్రజలను మభ్యపెట్టేందుకు విమర్శలు చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం పాత బిల్లులు చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రెండున్నరేళ్లలోనే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.100 కోట్ల వరకు మంజూరు చేయించగా.. మరో రూ.100 కోట్ల వరకు త్వరలోనే మంజూరు కానున్నాయన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్అలీ, నాయకులు వినోద్పటేల్, రమేష్ చౌహాన్, ముంతాజ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి


