కంగ్గి(నారాయణఖేడ్): డీలర్లు నాణ్యమైన ఉత్పత్తులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు, విత్తనాలు రైతులకు విక్రయించాలని ఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్ సూచించారు. మండల కేంద్రం కంగ్టిలోని రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో ఏఓ హరీశ్ పవార్తోపాటు ఆయన పాల్గొని మాట్లాడారు. నిషేధిత పత్తి విత్తనాలు అమ్మినా, నిల్వలు ఉంచినా, అనధికార ఎరువుల నిల్వలు ఉన్నా సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సైతం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి బిల్లులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన డీలర్లు పాల్గొన్నారు.
నారాయణ కళాశాలను
సీజ్ చేయాలి: ఎస్ఎఫ్ఐ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పర్మిషన్ లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్న నారాయణ కళాశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్, సతీశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ కళాశాల యాజమాన్యం బిల్డింగ్ పూర్తి కాకుండానే విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులు జోక్యం చేసుకుని సదరు కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వాణి నాయకులు సాయి, ప్రసాద్ పాల్గొన్నారు.
కుల సంఘం పేరిట
సంపాదన సరికాదు
రామచంద్రాపురం(పటాన్చెరు): కురుమ సంఘం పేరుతో కొందరు పదవులు, ఆస్తులను సంపాదించడం సరికాదని రాష్ట్ర కురుమ సంఘం ప్యానల్–2 హితవు పలికింది. రామచంద్రాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు శ్రీనాథ్, బీర్ల శ్రీనివాస్, కరికే సత్యనారాయణ, సురేశ్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ మల్లేశం కురుమ సంఘాన్ని తన సొంత లాభాల కోసమే వాడుకున్నారని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం కురుమ సంఘానికి పదెకరాల భూమి, రూ.10కోట్ల నిధులను కేటాయించిందని గుర్తు చేశారు. అయితే పదవుల కోసం ఐదెకరాల భూమిని, రూ.5కోట్లను ఇతరులకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న రాష్ట్ర కురమ సంఘం ఎన్నికల్లో ప్యానల్2 నుంచి తాము బరిలో ఉంటామని వారు తెలిపారు.
వేగంగా ధాన్యం కొనుగోళ్లు
వెల్దుర్తి(తూప్రాన్): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. గురువారం మాసాయిపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, రవాణా ఏ ర్పాట్లు, రైతులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్మిల్లులకు తరలించాలని సూచించారు. అనంతరం గ్రామ శి వారులోని ఓ రైస్మిల్లును సందర్శించారు. కా ర్యక్రమంలో తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఎంపీడీ ఓ విఘ్నేశ్వర్, గిర్దావర్ ధన్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


