సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యాశాఖ అధికారుల సూచనలు, ఉపాధ్యాయులు నిర్దిష్ట ప్రణాళిక, కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలనే విద్యార్థుల పట్టుదలతో పదిలో విద్యార్థులు విజయదుందుభి మ్రోగించారు. రాష్ట్రం ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పది ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా 28 మండలాలకుగానూ 5 మండలాలు 100% ఫలితాలు సాధించగా, 15 మండలాలు 99% ఫలితాలు సాధించాయి.
బాలికలదే హవా
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పదో తరగతి ఫలితాలో బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో 24,573మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా 24,252 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో జిల్లావ్యాప్తంగా 98.69% ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో 12,772 మంది బాలురకు గానూ 12,548 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 98.25 ఉత్తీర్ణత శాతం నమోదైంది. అదేవిధంగా 11,801 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 11,704 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 99.18 ఉత్తీర్ణత శాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది.
కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు సైతం వంద శాతం ఫలితాలు సాధించాయి. జిల్లావ్యాప్తంగా 17 కస్తుర్బా పాఠశాలలు వుండగా 16 కస్తూర్బా వసతిగృహాల్లో వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు రాగా, పుల్కల్లో ఒక విద్యార్థి మాత్రమే ఫెయిలైంది. 17 పాఠశాలలకు 767మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 766 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లావ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలల్లో 99.34% ఉత్తీర్ణత నమోదైంది.
మెరిసిన మల్కాపూర్ బాలికలు
గుమ్మడిదల మండలంలో అత్యల్పంగా 95.67%ఉత్తీర్ణత సాధించారు. కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థులు వర్షిత 594 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా మౌనిక 592 మార్కులతో ద్వితీయ స్థానంలో, ధనలక్ష్మీ 588 మార్కులతో జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచారు.
ఆదర్శ పాఠశాలలు అదుర్స్
ఆదర్శ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలతో ఆదర్శంగా నిలిచాయి. ప్రస్తుతం మోడల్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అదుర్స్ అనిపించారు. 10 పాఠశాలలకు గానూ 9 పాఠశాలు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. జిల్లాలో 928మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా 927మంది విద్యార్థులు హాజరయ్యారు. కేవలం ఒకే ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారు.
గురుకులాల్లోనూ ఉత్తమ ఫలితాలు
జిల్లావ్యాప్తంగా 11 గురుకులాలకు గానూ 10 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను నమోదు చేశాయి. జిల్లావ్యాప్తంగా 833మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు రాయగా 832మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక 197 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు గానూ 134 స్కూళ్లలో 100% ఫలితాలు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 9,489 మంది పరీక్షలకు హాజరు కాగా 9,305 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.


