సంగారెడ్డి క్రైమ్: ప్రమాదవశాత్తు ఇంట్లో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని శాంతినగర్కు చెందిన కడియాల సంగమేశ్వర్ (37), వృత్తిరీత్యా పట్టణంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లో ప్రమాదవశాత్తు నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ లీకై పేలడంతో పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న సంగమేశ్వర్తో పాటు కడియాల మల్లమ్మ(అమ్మ), 13 ఏళ్ల పాప, పనిచేసే వ్యక్తి చిన్నా(22)కు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు భయపడి పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ ఇంజిన్ రావడంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా అక్రమంగా నిల్వ ఉంచిన 6 కమర్షియల్, 7 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పట్టణ సీఐ రామునాయుడు, ఫైర్ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పుల్కల్లో రెండు పూరి గుడిసెలు దగ్ధం
పుల్కల్(అందోల్): మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు రెండు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. అవుసలి లక్ష్మణ్ చారి, అవుసలి పాండు రంగం చారి పూరిళ్లు ఆదివారం కాలిపోయాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ సర్పంచ్ లావణ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.
నలుగురికి తీవ్ర గాయాలు
సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం


