● నేషనల్ హైవేలపై పెరిగిన టోల్ చార్జీలు ● ఒక్కో జర్నీకి రూ.5 నుంచి రూ.15 వరకు పెంపు ● నేటి నుంచే అమల్లోకి..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జాతీయ రహదారులపై ప్రయాణాలు మరింత భారమయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన టోల్చార్జీలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే అధిక టోల్ చార్జీలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, మరింత పెరిగిన ఈ టోల్ చార్జీలతో వాహదారుల నడ్డి విరుగుతోంది. జిల్లా పరిధిలో ఉన్న 765డి జాతీయ రహదారిపై గుమ్మడిదల వద్ద ఉన్న టోల్ప్లాజా రేట్లు సుమారు 5% పెరిగాయి. కారు, జీపు, వ్యాన్, లైట్మోటార్ వెహికిల్కు సింగిల్ జర్నీకి ఇప్పటివరకు రూ.70 ఉండగా, ఈ చార్జీని రూ.75కు పెంచారు. అలాగే లైట్ కమర్షియల్ వెహికిల్కు రూ.115 నుంచి రూ.120కి పెంచారు. బస్సు, లారీలకు రూ.245 నుంచి రూ.250 చేశారు. ఇలా ప్రతీ వాహనంపై రూ.5 చొప్పున పెంచారు. జిల్లాలోని నేషనల్ హైవే 65 (ముంబై హైవేౖ)పై మునిపల్లి మండలం కంకోల్ వద్ద ఉన్న టోల్ప్లాజా రేట్లను పరిశీలిస్తే..కారు, జీపు, వ్యాన్లకు సింగిల్ జర్నీకి రూ.120 చార్జీ పెరగకపోయినా..రిటర్న్ జర్నీ ధరను రూ.175 నుంచి రూ.180కి పెంచారు. అలాగే లైట్మోటార్ కమర్షియల్ వాహనానికి రూ.190 నుంచి రూ.195కి పెరిగింది. బస్సు, ట్రక్కుకు రూ.400 నుంచి రూ.410కి పెరిగింది. ఈ రహదారిపై నిత్యం 15 వేల నుంచి 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వారాంతాలు, పండగ సీజన్లలో సుమారు 25 వేల వాహనాలు తిరుగుతుంటాయి. సగటున 4% నుంచి 5% టోల్చార్జీలు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాందేడ్–అకోలా రహదారిపై తాడ్దాన్పల్లి టోల్ప్లాజాలో కారు, జీపులకు సింగిల్ జర్నీకి రూ.125 నుంచి రూ.130కి పెరిగింది. అలాగే లైట్ కమర్షియల్ వాహనాలకు రూ.205 నుంచి రూ.210కి పెంచారు. బస్సు, లారీలకు రూ.430 నుంచి రూ.440కి పెంచారు.


