మద్యం తాగి వేధిస్తున్న కుమారులపై కేసు
దుబ్బాకటౌన్: నిత్యం మద్యం తాగి వచ్చి, తల్లిదండ్రులను తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్న కుమారులపై కేసు నమోదైంది. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ రాజేశ్ వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులకు కుమారులు నరేశ్, స్వామి, ఎల్లం, ఒక కుమార్తె కవిత ఉన్నారు. వీరికి ఒక ఇల్లుతో పాటు 6 ఎకరాల భూమి ఉంది. రెండో కొడుకు స్వామి, మూడో కొడుకు ఎల్లం ప్రతిరోజూ మద్యం తాగి తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని, లేదంటే చంపుతామని బెదిరిస్తున్నట్టు తల్లిదండ్రులు వాపోయారు. గతంలో ఇలాంటి బెదిరింపులకు పాల్పడగా అప్పటి సీఐ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలో వారి వేధింపులు భరించలేక, ప్రాణభయంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం నాలుగు రోజుల క్రితం సిద్దిపేటకు వెళ్లి, అక్కడి రోడ్లపై నివాసమున్నారు. రెండు రోజుల క్రితం వారు స్థానికుల సహాయంతో సిద్దిపేట సీపీ కార్యాలయంలో కొడుకుల వేధింపులపై ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ సాధన రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు ఆదివారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సీఐ రాజేశ్, ఎస్సై కీర్తి రాజు ఆధ్వర్యంలో కుమారులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులను వారింటికి చేర్చారు. తల్లిదండ్రులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుమారులను హెచ్చరించారు. సీపీ ఆదేశాల మేరకు ముగ్గురు కుమారులపై, కుమార్తైపె కేసు నమోదు చేశారు.


