తూప్రాన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళకు ఆదివారం అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సుమారు రెండు కిలోల గర్భాశయ ఫైబ్రాయిడ్ కణితిని తొలగించారు. వివరాలు ఇలా.. మండలంలోని దాతర్పల్లికి చెందిన బోసబోయిన లక్ష్మి కొంత కాలంగా తీవ్ర కడుపునొప్పి, రక్తహీనత సమస్యలతో బాధ పడుతుంది. పట్టణంలోని సుష్మ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించగా, ఆమె గర్భాశయంలో భారీగా పెరిగిన ఫైబ్రాయిడ్ కణితి ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. రోగికి అరుదైన ‘బి నెగిటివ్’ రక్తగ్రూప్ ఉండటం వల్ల చికిత్సలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె ఇద్దరు కుమారుల రక్తగ్రూప్ సరిపోవడంతో అవసరమైన రక్తాన్ని సమకూర్చి శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్ను డాక్టర్ హేమరాజ్ సింగ్, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ ప్రదీప్ సింహ బృందం రెండు గంటలపాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స ద్వారా రెండు కిలోల బరువున్న ఫైబ్రాయిడ్ గడ్డను తొలగించినట్లు డాక్టర్ ప్రదీప్ సింహ తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశముందని వైద్యులు తెలిపారు.


