● మహిళా సంఘాల సభ్యులకు నేడు పరీక్ష ● హాజరు కానున్న 28929 మంది సభ్యులు ● ఉదయం 9:30 నుండి సా.5 గం వరకు ● 480 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
సంగారెడ్డి జోన్: మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా అమలు పరుస్తున్నారు. చదువు రాని మహిళలను గుర్తించి చదువు నేర్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కొన్ని నెలలపాటు శిక్షణ కార్యక్రమాలు అందించి సాధారణ విద్యార్థుల మాదిరిగానే పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలలో 1,60,128 మంది సభ్యులు ఉన్నారు. 55,816 మంది మహిళలను నిరక్షరాస్యులుగా గుర్తించారు. మొదటగా 28,929 మంది మహిళలను ఎంపిక చేసి అక్షరాస్యులుగా మార్చేందుకు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళా సభ్యులు ఆదివారం నిర్వహించే ఎన్ఐఓఎస్ పరీక్షకు హాజరు కానున్నారు.
పంచాయతీలకు చేరుకున్న మెటీరియల్
పరీక్ష కొరకు అవసరమయ్యే మెటీరియల్ను జిల్లా కార్యాలయం నుంచి గ్రామ పంచాయతీలకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 480 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, మహిళా సంఘాల భవనాలలో ఉన్న మౌలిక వసతుల ఆధారంగా కేంద్రాలను గుర్తించారు. పరీక్షకు హాజరయ్యే వారి వివరాలు నమోదు చేసుకొని అనంతరం పరీక్ష రాస్తారు. చదవడం, రాయడం, గణితంలలో ప్రశ్నలు ఉండగా.. వీటన్నింటికీ 150 మార్కులు కేటాయించారు. నాలుగు రూట్లుగా విభజించి జిల్లా ప్రాజెక్టు మేనేజర్లను రూట్లకు ఇన్చార్జిలుగా నియమించారు. డీఆర్డీఏ, విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షా నిర్వహణ ఉంటుంది.


