ఆదర్శంగా ‘అమృత సత్తయ్య కొల్లూరి’ ఎడ్యుకేషన్ సొసైటీ
● వేలాది మందికి విద్యను అందిస్తూ..
● దేశం వ్యాప్తంగా విద్యార్థుల ఎంపిక
రామచంద్రాపురం(పటాన్చెరు):
పేదరికంతో చదువుకోలేని పరిస్థితి, కష్టాన్ని నమ్ముకుని ఎదిగిన మనిషి. కష్టానికి ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థ భెల్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తూ కార్మిక సంఘ నేతగా వారి సంక్షేమాన్ని కృషి చేశారు. అదే సమయంలో పేదరికంతో విద్యకు దూరమవుతున్న నిరుపేద విద్యార్థులకు అండగా నిలవాలనుకున్నారు కొల్లూరి సత్తయ్య. దాంతో తెల్లాపూర్ శివారులోని తన సొంత పొలంలో అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ(ఆస్క్)ను స్థాపించారు. కులమతాలకు అతీతంగా నిరుపేద విద్యార్థులను దేశవ్యాప్తంగా ఎంపిక చేసి వారికి అన్ని మౌలిక సదుపాయాలతో ఉచిత శిక్షణ అందిస్తూ విద్యాదాతగా ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆంగ్ల భాషపై ప్రత్యేక శిక్షణ..
నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషలో పట్టుసాధిస్తేనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్న లక్ష్యంతో కొల్లూరి సత్తయ్య పేద విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా నిపుణులతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. దాంతో విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి సంస్థలలో ఉద్యోగాలు సాధిస్తున్నారు.
ఆధునిక సదుపాయాలతో
విద్యాబోధన..
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువునే విధంగా అన్ని వసతులను కల్పించారు. ప్రధానంగా కంప్యూటర్ ల్యాబ్,డిజిటల్ క్లాస్ రూమ్, ఓపెన్ థియేటర్, గ్రంథాలయం వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిగత వికాసం, ఆహార అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.
సొంత పొలంలోనే విద్యాకేంద్రం
నిరుపేదల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా తన సొంత పొలంలో జనవరి 2022లో అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ(ఆస్క్) ఏర్పాటు చేశారు. విద్యార్థులకు విశాలమైన తరగతి గదులు, వసతి గదులు ఏర్పాటు చేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేక శిక్ష ణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పేదరికం కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇక్కడ శిక్షణ అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా విద్యార్థుల ఎంపిక..
కుల మతాలకతీతంగా దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ప్రధానంగా పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించే విధంగా ఇక్కడి అధ్యాపకులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
ఉల్లాసంగా ఉండేందుకు..
శిక్షణ పొందే విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. నిర్వాహకులు అందులో భాగంగా 5:30
గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థుల కోసం వ్యాయామశాల ఏర్పాటు చేశారు. యోగాపై శిక్షణ అందిస్తున్నారు.
ప్రత్యేకంగా మెనూ ఏర్పాటు
మనం వివిధ స్థాయిలలో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపొందించాలని నేను నమ్ముతాను. తద్వారా, బాధ్యతగల పౌరులుగా మనం రాజ్యాంగ విలువలను మరింత ప్రోత్సహించి, అమలు చేయగలం. అన్ని అసమానతలకు అతీతమైన సమాజాన్ని నిర్మించాలనే సామాజిక దృక్పథంతో నా చివరి శ్వాస వరకు దీనిని కొనసాగించాలనే లక్ష్యంతో నేను, నా కుటుంబ సభ్యులు, ఇక్కడున్న ఫాకల్టీలు కలసి పని చేస్తున్నాం. దేశ నిర్మాణం, సామాజిక మార్పుతోనే మొదలవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను, మరియు ఈ ప్రక్రియలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంది. యువతరం సామాజిక సమస్యలతో ఎంతో చైతన్యవంతంగా బాధ్యతాయుతంగా మమేకమవుతుందనే దానిపైనే సమాజం మరియు దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది.
– కొల్లూరి సత్తయ్య, ఆస్క్ వ్యవస్థాపకులు
నేను ఇక్కడికి రాక ముందు పశ్చిమ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ గురించి విన్నాను. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. మా మణి సార్ చెప్పినట్టుగా, నిజమైన శాంతినికేతన్ మాత్రం మన అమృతవనమే. అమీర్పేట్ మైత్రివనం దిశలేని విద్యార్థి జీవితమైతే, ఈ అమృతవనం దిశ చూపించే ప్రేరణ, ఇక్కడ నేను ప్రకృతి మధ్య స్వేచ్చగా ఆలోచించడం నేర్చుకోవడం నేర్చుకున్నాను. జ్ఞానంతో అమృతమ్మ కుటుంబం చూపించిన ప్రేమ, ఆప్యాయతలు మా జీవితానికి విలువైన సంపద. వాటిని ఆచరించడం మా బాధ్యత.
– స్వాతిక ద్యాగలి, విద్యార్ధిణి
ఆస్క్ బాధ్యతలు.. 1) కొల్లూరి సత్తయ్య అధ్యక్షులు 2) ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ ఉపాధ్యక్షులు 3) కొల్లూరి భరత్ ప్రధాన కార్యదర్శి 4) కొల్లూరి సౌజన్య కోశాధికారి 5) విజయ్, ఆర్.ఈశ్వర్ ప్రసాద్, యాదగిరి బోర్డు సభ్యులు 6) డా.బాలబోయిన సుదర్శన్ ఫ్యాకల్టీ, డైరెక్టర్ 7) పల్లికొండ మణికంఠ ఫ్యాకల్టీ, అకాడెమిక్ కోఆర్డినేటర్ 8) డా.నైనాల సతీష్, ప్రశాంత్ తివారీ ఇంగ్లిష్ ఫ్యాకల్టీలు
ఇది నిజమైన మరో శాంతినికేతన్
సామాజిక మార్పుతోనే దేశ నిర్మాణం


