కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
హత్నూర(సంగారెడ్డి): చెరువులో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని ముచ్చర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తాల్కా సాయిలు భార్య తాల్క రుక్కమ్మ(40) ఈనెల 24న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని చెరువు తూము వద్ద మహిళ శవం తేలి ఉందని గ్రామస్తులు తెలుపడంతో భర్తతోపాటు కుటుంబీకులు వెళ్లి రుక్కమ్మగా గుర్తించారు. తరచూ ఇంట్లో చిన్న, చిన్న గొడవలు జరిగేవని, ఈ క్రమంలోనే ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చుట్టాల ఇంటికి వచ్చి...
జహీరాబాద్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్ఐ కాశీనాథ్ కథనం ప్రకారం... హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్కు చెందిన ఎం.బక్కారెడ్డి(40) సీసీ టీవీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం బంధువులైన జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలోని మోహన్రెడ్డి ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం 5 గంటలకు ఇంట్లో చెప్పి సొంత ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆయన ఆచూకీ కోసం వెతకగా పాఠశాల వెనుకభాగంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడికి వివాహం కాకపోవడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడు అన్న జగన్నాథ్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


