కూతురితో ప్రియుడికి ఫోన్ చేయించి..
యువకుడిపై దాడి
నర్సాపూర్: కూతురిని ప్రేమించాడన్న కారణంతో ఓ యువకుడిపై ఆమె కుటుంబసభ్యులు కోపం పెంచుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తాము అనుకున్న ప్రదేశానికి రప్పించి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన నర్సాపూర్ అటవీ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ కుమార్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లక్మతాండకు చెందిన దేవాసోత్ దేవిసింగ్, అదే జిల్లాకు చెందిన కంది మండలం బ్యాతోల్ గ్రామానికి చెందిన సంధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి ప్రేమ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో ఈనెల 20 (మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దేవిసింగ్ను నర్సాపూర్ బస్టాండ్కు రావాలని సంధ్యతో ఫోన్ చేయించారు. అతడు బస్టాండ్కు వచ్చి సంధ్యతో మాట్లాడుతుండగా ఆమెకు సోదరులైన వెంకటేష్, నరేష్, కార్తీక్, తరుణ్ తదితరులు వారి వద్దకు వచ్చి దేవిసింగ్, సంధ్యను బలవంతంగా కారులో ఎక్కించుకొని నర్సాపూర్– తూప్రాన్ జాతీయ రహదారిపై ఉన్న చాకరిమెట్ల హనుమాన్ ఆలయ సమీపంలోకి తీసుకెళ్లారు. దేవిసింగ్ను కారులో నుంచి కిందకు దింపి అడవిలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోగానే చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. కాగా దేవిసింగ్ తేరుకొని రోడ్డుపైకి వచ్చి ఆటోలో నర్సాపూర్, ఇక్కడి నుంచి సూరారంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. కాగా దేవిసింగ్ తండ్రి విఠల్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు.


