స్వీయరక్షణతో ప్రమాదాలకు చెక్
ఎస్పీ పరితోశ్ పంకజ్
జహీరాబాద్ టౌన్: స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని, ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ‘అరైవ్ అండ్ అలైవ్’కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం జహీరాబాద్ పోలీస్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులున్నా..లేకున్నా..వాహనాలు నడిపేవారు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. మోటారు బైక్లు నడిపే సమయంలో హెల్మెట్, కారు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని సూచించారు. మద్యం మత్తు ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు 400 మంది వరకు చనిపోయారని చెప్పారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పోలీసులకు ఆయన హెల్మెట్లను పంపిణీ చేశారు. ట్రాఫిక్ నియమాలు ప్రతిబింబించేలా ముగ్గు వేసిన కానిస్టేబుల్ వనజను ఎస్పీ అభినందించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కవిత దేవి, సీడీపీఓ.సుశీల, ఆర్డీఓ దేవూజా, డీఎస్పీ సైదానాయక్, తహసీల్దార్ దశరథ్, ఎంవీఐ.వెంకటయ్య, జహీరాబాద్ టౌన్ సీఐ.శివలింగం తదితరులు పాల్గొన్నారు.


