ఆదాయ, వ్యయాలపై ఆరా
సంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రతీ ఏటా వివిధ రకాల నిధులతో అనేక అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఈ అభివృద్ధి పనులకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులు, ఆదాయ, వ్యయ వివరాలను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ఆడిట్లో నిధులు సద్వినియోగమయ్యా లేక అక్రమ మార్గం పట్టాయా అనే అంశాన్ని తేలుస్తారు. గత ఆర్థిక ఏడాది 2024–25కు సంబంధించిన ఆదాయ, వ్యయాలపై ప్రస్తుతం ఆడిట్ కొనసాగుతోంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చులపై ఆడిటర్లు తనిఖీలు చేస్తారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్తు, వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో ప్రతీ ఏటా వార్షిక తనిఖీ చేస్తుంటారు. వీటన్నంటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరవుతాయి. వీటితోపాటు పంచాయతీలకు సాధారణ నిధులతోపాటు ఎస్ఎఫ్సీ 15ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతుంటాయి. పంచాయతీ పరిధిలో ప్రజలు ఇంటిపన్ను, వృత్తి వ్యాపార లైసెన్సు పన్నులు పంచాయతీకి చెల్లిస్తుంటారు. మున్సిపల్ కార్యాలయాలకు అర్బన్ డెవలప్మెంట్, ఇంటి, కుళాయి, వృత్తి వ్యాపారాల లైసెన్స్తోపాటు వివిధ రకాల పన్నులు, జరిమానాల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఆలయాలు, మార్కెట్ కమిటీలకు సైతం నిధులతోపాటు వివిధ రకాల ఆదాయం సమకూరుతుంది. ఆయా నిధులతో ఎంత కేటాయించి, ఎంత ఖర్చు చేశారు అనే అంశాలతోపాటు వాటి బిల్లులు, ఓచర్లు, బుక్కులు, రశీదులు, రికార్డులను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వసూలైన పన్నులు జమ చేశారా లేదా అనే అంశాలు ఆడిట్లో చూస్తారు.
ఆడిట్ పూర్తి చేసిన వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసి నివేదికలను సిద్ధం చేస్తారు. గతంలో మాన్యూవల్ పద్ధతిలో వివరాలు నమోదు చేసేవారు. అయితే గత నాలుగేళ్ల నుంచి ఆన్లైన్ విధానంలో చేస్తున్నారు. ఆడిట్ నిర్వహించిన అదేరోజు వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ విధంగా నమోదు చేసిన తర్వాత మార్పులు చేసేందుకు అవకాశాలుండవని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
15 మంది అధికారులతో...
15 మంది ఆడిట్ అధికారులతో అన్నింటిలోనూ తనిఖీ చేస్తారు. మున్సిపల్ పరిధిలో విలీనం చేసిన గ్రామపంచాయతీలలో సైతం పంచాయతీల వారీగానే ఆడిట్ చేస్తున్నారు. ఆడిట్ కోసం ముగ్గురు అసిస్టెంట్, 11 సీనియర్ ఆడిటర్లు, ముగ్గురు జూనియర్ ఆడిటర్లను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో ఆడిట్ కొనసాగుతోంది.
ఆడిట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు రికార్డుల్లో వివరాలు తప్పులతడకగా నమోదైనట్లు తెలుస్తోంది. రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవటం, వివరాలు తప్పుగా నమోదు చేయటం, చేసిన పనుల కంటే ఎక్కువగా రికార్డు చేయడం, అభివృద్ధి పనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని జమ చేయకపోవటంతో పాటు తదితర అంశాలను గుర్తిస్తు న్నారు. ఆడిటింగ్ పూర్తయిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి నివేదికలను సిద్ధం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.


