
తాను చనిపోతూ ఆరుగురికి అవయవదానం
అల్లాదుర్గం(మెదక్): తాను చనిపోతూ వ్యక్తి ఆరుగురికి అవయవదానం చేశాడు. వివరా లు ఇలా... మండలంలోని చేవెళ్ల నివాసి మదునురోళ్ల శ్రీకాంత్ దసరా పండుగను సంతోషంగా తన స్వగ్రామంలో చేసుకున్నాడు. వృత్తి రీత్యా హైదరాబాద్కు తిరిగి బయలు దేరాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడ్ని హైదరాబాద్లోని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
జూదరుల అరెస్ట్
పాపన్నపేట(మెదక్): జూదం ఆడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీనివాస్గౌడ్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని యూసుఫ్పేట గ్రామ శివారులో జూదం ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడిలో 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.14,049 నగదు, 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
గాంధీనగర్లో..
హుస్నాబాద్రూరల్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా... మండలంలోని గాంధీనగర్ మామిడి తోటలో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రూ.6,010 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.
పెట్రోల్ బంక్లో చోరీ
నిజాంపేట(మెదక్): పెట్రోల్ బంక్లో గుర్తు తెలియని వ్యక్తులు పలు సామగ్రిని అపహరించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో భారత్ పెట్రోల్ బంక్ను ఎనిమిది నెలల నుంచి మూసివేశారు. కాగా మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆఫీస్ అద్దాలు పగులగొట్టి కంప్యూటర్ మానిటర్, సీసీ కెమెరా మానిటర్ను దొంగిలించారు. బంక్ యాజమాని యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెటర్నరీ ఆస్పత్రిలో..
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని వెటర్నరీ ఆస్పత్రిలో చోరీ జరిగింది. వివరాలు ఇలా... ఆస్పత్రిలోని స్టోర్ రూమ్ తాళం పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు సంపు మోటారును ఎత్తుకెళ్లారు. మంగళవారం సిబ్బంది వచ్చి చూడగా స్టోర్ రూం తాళం పగులగొట్టి ఉంది. వెటర్నరీ ఆఫీసర్ గీతా మాలిక మోటార్తో పాటు చిన్న చిన్న వస్తువులు దొంగిలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
దాడి కేసులో ఇద్దరు అరెస్టు
జోగిపేట(అందోల్): టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, భార్య వరలక్ష్మిపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎస్ఐ పి.పాండు కేసు వివరాలు వెల్లడించారు. వీరప్ప దంపతులు కంది మండలం నుంచి టేక్మాల్ గ్రామానికి కారులో వెళుతుండగా అందోలు గ్రామానికి చెందిన ఎండి. షాహిద్, ఎండి. జాఫర్ ద్విచక్ర వాహనంపై అజాగ్రత్తగా మద్యం మత్తులో నడుపుతూ వారి కారును ఢీకొట్టారు. అంతేగాక కారును అడ్డగించి వీరప్పను కొట్టారు. అడ్డుకోబోయిన భార్య వరలక్ష్మిని కూడా గాయపరిచారు. కాగా నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపించారు.
పాము కాటుతో
యువకుడి మృతి
దౌల్తాబాద్ (దుబ్బాక): పాము కాటుతో యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన జానిగామ దయాకర్ (22) తమ పంట చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో పాము కాటు కరిచింది. వెంటనే అతడ్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తాను చనిపోతూ ఆరుగురికి అవయవదానం