
ౖపైపెకి పొంగంగ
ఝరాసంగంలో అత్యధికంగా 9.3 మీటర్లు పైకి పుల్కల్లో గతేడాది కంటే స్వల్పంగా తగ్గుదల గత నెలలో కురిసిన భారీ వర్షాలే కారణం
జిల్లాలో సగటున 2.94 మీటర్లకు పెరిగిన నీటిమట్టం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భూగర్భ జలమట్టం ౖపైపెకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నీటిమట్టాలు భారీగా పెరిగాయి. గతేడాది 2024 ఆగస్టుతో పోలిస్తే జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం ఏకంగా 2.94 మీటర్లు పైకి వచ్చినట్లు భూగర్భజలశాఖ అధికారుల పరిశీలనలో తేలింది. ఏడాది ఆగస్టులో జిల్లా సగటు నీటి మట్టం 11.06 మీటర్లు ఉండగా ఇప్పుడు 8.12 మీటర్లకు చేరింది. అత్యధికంగా ఝరాసంగం మండలంలో ఏకంగా 9.3 మీటర్లు పైకి వచ్చింది. ఇక్కడ గతేడాది ఆగస్టులో 11.32 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 1.93 మీటర్లకు పెరిగింది. కొండాపూర్లో 5.94 మీటర్లు, నారాయణఖేడ్ 5.06 మీటర్లు, నిజాంపేట్లో 5.24 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. భారీ వర్షాలు నమోదైన పుల్కల్ మండలంలో మాత్రం భూగర్భ జలమట్టం స్వల్పంగా తగ్గడం గమనార్హం. ఇక్కడ 7.04 మీటర్ల నుంచి 8.60 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గుర్తించారు.
33 శాతం వర్షం అధికంగా..
ఈ నీటిమట్టాలు పెరగడానికి ప్రధాన కారణం గత నెలలో కురిసిన భారీ వర్షాలేనని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పంటలు నీటమునిగే స్థాయిలో వర్షాలు కురవడంతో వర్షం నీళ్లు భూమిలోకి భారీగా ఇంకి ఈ నీటి మట్టాలు పెరిగాయి. జిల్లాలో ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతం 536.6 మి.మీలు కాగా, ఇప్పటివరకు 711.6 మి.మీ.ల వర్షపాతం రికార్డయింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 33 శాతం అధిక వర్షం కురిసింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 43 రోజుల వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఆగస్టులోనే వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు భారీగా పెరిగాయి. భారీ వర్షాలకు కొన్ని బోరు బావుల్లోంచి నీళ్లు ఉబికి వచ్చాయి. జహీరాబాద్ మండలం పస్తాపూర్లో ఓ రైతు వ్యవసాయబోరు నుంచి మోటార్ ఆన్ చేయకపోయినా నీళ్లు పైకి వచ్చాయి. ఇలాంటి ఘటనలు జిల్లాలో అక్కడక్కడ వెలుగులోకి వచ్చాయి.
మండలం నీటిమట్టం (మీటర్లలో)
కంగ్టి 16.17
హత్నూర 16.16
కల్హేర్ 14.52
గుమ్మడిదల 13.26
సంగారెడ్డి 12.97
కొండాపూర్ 12.59
పటాన్చెరు 12.47
నిజాంపేట 10.86
సిర్గాపూర్ 8.92
పుల్కల్ 8.60
అందోల్ 8.22
చౌటకూర్ 8.11
కోహీర్ 7.68
జిన్నారం 7.34
మండలం నీటిమట్టం (మీటర్లలో)
సదాశివపేట 6.87
కంది 6.63
ఆర్సీపూర్ 6.11
జహీరాబాద్ 4.98
న్యాల్కల్ 3.87
నారాయణఖేడ్ 3.39
మొగుడంపల్లి 3.14
ఝరాసంగం 1.93
మనూర్ 1.84
రాయికోడ్ 1.73
మునిపల్లి 1.47
నాగల్గిద్ద 1.43
వట్పల్లి 1.04
అమీన్పూర్ 0.68
జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో ఆగస్టులో నమోదైన భూగర్భ జలమట్టాలు..
భూగర్భ జలశాఖ ప్రతీనెల 15వ తేదీ నుంచి 25 వరకు భూగర్భ జలమట్టాలను సేకరిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 74 చోట్ల ఉన్న ఫీజో మీటర్లలో ఈ నీటిమట్టాలను సేకరించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతారు.