
ఆన్లైన్లో దుస్తులు కొనేందుకు యత్నం..
రూ.98 వేలు పోగొట్టుకున్న వ్యాపారి
పటాన్చెరు టౌన్: ఆన్లైన్లో దుస్తులు కొనేందుకు యత్నించిన ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్కు చెందిన ఓ బట్టల వ్యాపారి జులై 23న ఆన్లైన్లో బట్టలు కొనేందుకు సెర్చ్ చేస్తూ, తన ఫోన్నంబర్ను కొన్ని సైట్లలో నమోదు చేశాడు. దీంతో అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మీరు దుస్తుల కోసం సర్చ్ చేస్తున్నారు కదా.. అని బాధితుడి నుండి వివరాలు తీసుకున్నాడు. దుస్తులను పంపేందుకు రూ.98 వేలు చెల్లించాలని కోరగా.. బాధితుడు బ్యాంకు ద్వారా నగదును అపరిచిత వ్యక్తికి పంపించాడు. ఈ క్రమంలో అతడికి ఫోన్ చేయగా మెటీరియల్ ఫొటోలను పంపుతున్నానని చెబుతూ వచ్చాడు. చివరికి మోసపోయినట్టు గ్రహించి ముందుగా సైబర్ క్రైమ్, శుక్రవారం పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలికపై అత్యాచార యత్నం
: పోక్సో కేసు నమోదు
నారాయణఖేడ్: బాలికపై ప్రేమ పేరుతో యువకుడు అత్యాచార యత్నం చేశాడు. ఈ ఘటన మండలంలోని అంత్వార్ గ్రామశివారులో చోటుచేసుకుంది. ఎస్సై విద్యాచరణ్రెడ్డి వివరాల ప్రకారం... న్యాల్కల్ మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక, సిర్గాపూర్ మండలానికి చెందిన 19 ఏళ్ల యువకుడు బంధువులు. వినాయక ఉత్సవాల్లో భాగంగా బాలిక ఖేడ్ మండలం అంత్వార్ గ్రామంలోని బంధువుల వద్దకు వచ్చింది. దీంతో ఆ యువకుడు సైతం అక్కడికి వచ్చాడు. కాగా బంధువులు రాత్రి సమయంలో వినాయక నిమజ్జనంలో ఉన్న సమయంలో యువకుడు బాలికకు ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాలిక గాయాలపాలైంది. అక్కడి నుండి యువకుడు పారిపోయాడు. ఈ విషయం బాలిక బంధువులకు తెలువడంతో చికిత్స నిమిత్తం ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.