
బాధితులకు పునరావాసం కల్పించండి
సంగారెడ్డి జోన్: భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ప్రాంతంలో ఎంఎంటీఎస్ రైల్వేలైన్ నిర్మాణం నేపథ్యంలో నివాస గృహాలు కోల్పోయిన బాధితులకు పునరావాసం కల్పించాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కార్పొరేటర్ సింధుతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన సుమారు 218 కుటుంబాలు పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నిర్వాసితులకు ఇళ్లు కేటాయించినా, ఈ ప్రాంతంలోని 218 కుటుంబాలకు మాత్రం ఇప్పటికీ కేటాయించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలన్నారు.
ఐక్య పోరాటాలతోనే
హక్కుల సాధన
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు రక్షించుకుంటామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన పారిశ్రామిక యూనియన్ల నాయకత్వ స్థాయి ట్రేడ్ యూనియన్ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. నిత్యావసర ధరలు పెరిగినా కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. రాష్ట్రంలో 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచటం, మహిళలతో రాత్రివేళ పనిచేయించే అవకాశం కల్పించటం వంటివి లేబర్ కోడ్ అమలులో భాగమేనని వివరించారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు, నాయకులు రాజయ్య, మాణిక్యం, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై
అవగాహన అవసరం
జహీరాబాద్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి అన్నారు. సోమవారం మండలంలోని బూచనెల్లిలో గల మైనారిటీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుతో పాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే నిత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు దోహదపడుతుందన్నారు. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించడానికి చట్టాలు తోడ్పడతాయని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆయిల్పామ్ సాగుతో
అధిక లాభాలు
నర్సాపూర్ రూరల్: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రతాప్సింగ్ రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని అచ్చంపేటలో ఓ రైతు పొలంలో లీఫ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో రైతులు తమ భూముల్లో ఆయిల్పామ్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ సైతం ఇస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లీఫ్ ఫాం రిసోర్స్ కంపెనీ మేనేజర్ కృష్ణ, ఏఈఓ దుర్గాప్రసాద్, రైతులు పాల్గొన్నారు.

బాధితులకు పునరావాసం కల్పించండి

బాధితులకు పునరావాసం కల్పించండి