
పంచాయతీ కార్మికుల వేతనాలు విడుదల
ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీ
కార్మికులు, విడుదలైన నిధుల వివరాలు
జిల్లా గ్రామ వర్కర్లు నిధులు
పంచాయతీలు (రూ.కోట్లలో)
సంగారెడ్డి 620 2,316 6.39
మెదక్ 465 1,535 4.34
సిద్దిపేట 493 2,171 6.17
● గ్రామపంచాయతీ ఖాతాలలో జమ
● కొత్త జీపీలకు విడుదల కాని నిధులు
● ఉమ్మడి మెదక్లో రూ.16.90కోట్లు విడుదల
సంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీలలో మురికి కాలువలు శుభ్రం చేయడం, చెత్త సేకరణ, డంపింగ్యార్డ్కు తరలించడంతోపాటు వివిధ రకాల విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఊరట లభించింది. మూడు నెలలుగా సకాలంలో వేతనాలు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ పోషణభారం ఎదుర్కొన్నారు. గ్రామాలలో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన విధంగా నిధులు రాకపోవడంతో పంచాయతీల నిర్వహణ భారం ఆయా కార్యదర్శులపై పడుతుంది. అదేవిధంగా వేతనాలు రాకపోవటంతో పంచాయతీ కార్మికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వేతనాలు విడుదలతో కార్మికుల హర్షం
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 74 మండలాలు ఉండగా 1,578 గ్రామ పంచాయతీలున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 6,022 మంది బహుళ ప్రయోజనాల కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా సుమారు ఒక్కొక్కరికి రూ.9,500లు అందిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు సుమారు రూ.16.90కోట్ల నిధులు విడుదలైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. నేరుగా సంబంధిత గ్రామ పంచాయతీలలో నిధులు జమ కానున్నాయి.
త్వరలో కొత్త జీపీ కార్మికులకు
ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల కార్మికులకు వేతనాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఆయా గ్రామ పంచాయతీలకు టీజీ బీ–పాస్ అకౌంట్లు లేకపోవటంతో కార్మికుల వేతనాలు విడుదల కాలేదు. గ్రామ పంచాయతీల వారీగా ఖాతాలు తెరవాలని గ్రామ పంచాయతీ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేశారు. అకౌంట్ నంబర్లు అప్డేట్ కాగానే వారికి సైతం వేతనాలు విడుదల కానున్నాయి.
పంచాయతీ ఖాతాలలో జమ
గ్రామ పచాయతీ కార్మికులకు మూడు వేతనాలు విడుదలయ్యాయి. నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలలో జమవుతాయి. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు ఖాతాలు ఓపెన్ చేయాలని ఆదేశించాం. వారికి కూడా త్వరలోనే వేతనాలు విడుదలవుతాయి.
–సాయిబాబా,
జిల్లా పంచాయతీ అధికారి, సంగారెడ్డి

పంచాయతీ కార్మికుల వేతనాలు విడుదల