
ప్రజావాణిలో 44 అర్జీలు
సంగారెడ్డి జోన్: అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు 44 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, తదితరులు పాల్గొన్నారు.
భారత్ సైనిక శక్తి
ప్రపంచానికి తెలిసింది
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: మన దేశం వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ మన దేశ ఆర్మీ వీరోచితంగా పోరాడి విజయం సాధించిందని, ఇక భవిష్యత్లో దేశ పౌరులపై దాడి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, రమేష్, రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, రాజశేఖర్ రెడ్డి, మాణిక్యరావు పాల్గొన్నారు.
లావణ్యకు కెమిస్ట్రీలో పీహెచ్డీ
పటాన్చెరు: మండల పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని లావణ్య డాక్టరేట్కు అర్హత సాధించారు. బయోమైక్రో మాలిక్యూల్స్తో కూమరిన్ అనలాగ్లను బంధించడం, వాటి యాంటీ ఆక్సిడెంట్ అధ్యయనాలపై, బయోఫిజికల్ అంతర్దృష్టులపై ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ బిజయ కేతన్ సాహూ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ లావణ్య పరిశోధనకు మాలిక్యులర్ డాకింగ్ అధ్యయనాలు మరింత మద్దతు ఇచ్చాయని, ఆయా విధానాలపై లోతైన అంతర్దృష్టులను అందిస్తున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ లావణ్య సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొ ఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అభినందించారు.
ధాన్యం కొనుగోళ్లను
వేగిరం చేయండి
ఐకేపీ ప్రాజెక్టు మేనేజర్ జయశ్రీరాజ్
నారాయణఖేడ్: స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేయాలని ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజరు జయశ్రీరాజ్ సూచించారు. నారాయణఖేడ్ మండలం కొండాపూర్, గంగాపూర్, తుర్కాపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తరచూ వర్షాలు కురుస్తున్నందున కొనుగోళ్లను ముమ్మరం చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట ఏపీఎం వంశీకృష్ణ, సీసీ అశోక్ గౌడ్, వీఓఏలు సుల్తానా, సమత ఉన్నారు.
సేంద్రియ ఎరువులతో
అధిక దిగుబడులు
వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు
పటాన్చెరు: రైతులు రసాయనాల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులతో రైతులు అధిక దిగుబడులు పొందాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ రాధిక డాక్టర్ హిమబిందు, డాక్టర్ శస్ట్రీన్ అన్నారు. సోమవారం మండలంలోని పెద్దకంజర్ల, లక్డారం, గ్రామాలలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులకు నష్టాలు తగ్గించి రైతే రాజుగా లాభాలను పెంచే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.