
సంపద సృష్టే సర్కారు లక్ష్యం
● రోడ్ల నిర్మాణంతో గ్రామాల అనుసంధానం ● మంత్రి దామోదర రాజనర్సింహ ● రూ.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● సంగారెడ్డి నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/సదాశివపేట రూరల్(సంగారెడ్డి)/కొండాపూర్(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్/సంగారెడ్డి: రోడ్ల నిర్మాణంతో గ్రామాల మధ్య అనుసంధానం జరిగి సంపద సృష్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మంత్రి దామోదర మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా సంగారెడ్డిలో రూ.90 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. పోతిరెడ్డిపల్లి (ఎన్హెచ్65) నుంచి కలివేముల రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ నుంచి సింగూర్ ప్రాజెక్టు వరకు రూ 5.25కోట్ల ఎంఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి, కొండాపూర్ మండల పరిధిలోని అలియాబాద్ నుంచి గారకుర్తి వరకు సీఆర్ఆర్ నిధులతో రూ.10 కోట్లు, మారెపల్లి నుంచి వయా గోటీలగుట్ల మీదుగా సీతారాంకుంట తండా వరకు రూ.2.65 కోట్ల సీఆర్ఆర్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు సంగారెడ్డి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్, పోతిరెడ్డి పల్లిచౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రోడ్ల నిర్మాణం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్కు చేరువవుతాయన్నారు. దీంతోపాటు చిన్న పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి సంపద సృష్టి సాధ్యమవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడంతోపాటుగా రైతు భరోసా,రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తోందని వివరించారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభు త్వం రూ.5 లక్షలు అందిస్తోందని తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించా లని సూచించారు. సిగ్నల్స్ జంప్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానాలు విధిస్తారని హెచ్చరించారు.
ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతాం
సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని నిర్మలారెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ రవీందర్రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల అధికారులు, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, డీఎస్పీ సత్తయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.