కుల్కచర్ల: పాంబండ రామలింగేశ్వర ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, ఈఓ బాలనర్సయ్య తెలిపారు. శ్రావణమాస ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. రూ.3,67,060 సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారి పాండు శర్మ పాల్గొన్నారు.
ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామం వద్ద హైద్రాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. కడ్తాల్ మండల కేంద్రం నుంచి బోలెరోలో కూలీలను తీసుకెళ్తున్న డ్రైవర్ కోడెల ప్రశాంత్ నిర్లక్ష్యంతో వాహనం బోల్తాపడింది. విఠాయిపల్లి వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో బోలెరో బోల్తా పడింది. ఈసమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో దేవ్సింగ్ మృతిచెందగా, గగన్సింగ్, విజయ్ తీవ్రంగా గాయపడ్డారు.
సెర్ప్ డీపీఎం నర్సింలు
దౌల్తాబాద్: గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని సెర్ప్ డీపీఎం నర్సింలు సూచించారు. బుధవారం దౌల్తాబాద్లో మండల మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రతి సభ్యురాలికి వివరించాలని సూచించారు. రుణాల రికవరీ చేయాలన్నారు. సకాలంలో మహిళలు బ్యాంకు రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మహిళల అ భ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకన్న, సీసీలు రామకృష్ణ, బాల్రాజు, జయమ్మ. జయమ్మ, రాజు, మండ ల మహిళా అధ్యక్షురాలు నర్సమ్మ, కోశాధికారి భీమమ్మ, కార్యదర్శి యశోద పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల హెచ్ 82 జిల్లా కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా సుభాన్
అనంతగిరి: తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ హెచ్ 82 జిల్లా, డివిజన్ కమిటీలను బుధవారం పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీఎస్ పీడీసీఎల్ కంపెనీ యూనియన్ సెక్రటరీ కే వెంకటేష్, జాయింట్ సెక్రటరీ ఎండీ జమీల్, జిల్లా మాజీ అధ్యక్షుడు బీ జైపాల్రెడ్డి అధ్యక్షతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ విద్యుత్ సరఫరాలో కీలక సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు సంబంధించిన సమస్యలు, హక్కుల సాధన కోసం యూనియన్ తరఫున నిరంతరం పోరాటం చేస్తామని నూతన కమిటీ నాయకులు తెలిపారు. కమిటీ జిల్లా అధ్యక్షుడిగా సుభాన్, ప్రధాన కార్యదర్శిగా వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్, వికారాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా రామాంజనేయులు, తాండూరు అధ్యక్షుడిగా లాలు, ప్రధాన కార్యదర్శి కృష్ణ నియమితులయ్యారు.


